మహబూబాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేంలేదు.. కేవలం ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నయ్.. గిరిజనుల అభ్యున్నతి ఒక్క బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది’ అని బీఆర్ఎస్ మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవిత తేల్చిచెప్పారు. ‘ఈ ఎన్నికల్లో 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ అంటున్నది. దీని వెనుక ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం చేసే కుట్ర దాగి ఉంది.’ అని అనుమానం వ్యక్తం చేశారు.
తండాలను పంచాయతీలుగా చేసి, రిజర్వేషన్లు 10శాతానికి పెంచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని చెప్పిన ఆమె, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసి పంపితే కేంద్రంలోని బీజేపీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గుర్తుచేశారు. మంగళవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైదరాబాద్లో గిరిజన, ఆదివాసీల భవన్ నిర్మించి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి కేసీఆరేనని గుర్తుచేశారు. ‘మా పార్టీ గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి’ అని కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయి.
ఆ రెండు పార్టీలు చెప్పేవి పచ్చి అబద్ధాలు. దేవుని పేరు చెప్పి బీజేపీ ఓట్లడుగుతున్నది. హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ దేవుని మీద ఒట్టేస్తున్నది. మేము మాత్రం ఆ దేవున్ని, ప్రజలను నమ్ముకొని చేసిన అభివృద్ధి చూసి ఓటెయ్యాలని కోరుతున్నాం. రాష్ట్ర విభజన హామీలను బీజేపీ సర్కారు మరిచిపోయింది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న గిరిజన యూనివర్సిటీని పదేళ్లుగా నాన్చి ఇటీవల ప్రారంభించారు. ముఖ్యంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పక్కనబెట్టింది. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని బీసీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎంపీలమంతా కేంద్రానికి చాలాసార్లు విన్నవించినా కేంద్రం పట్టించుకోలేదు. ఇక ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నది.
తెలంగాణ ధ్యాస పట్టని ఆ పార్టీలతో అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాలి. నా నియోజకవర్గంలోని ప్రజలు కాంగ్రెస్ను ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడుతున్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలోనే సీఎం రేవంత్రెడ్డి బిజీగా ఉన్నాడు. క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వకపోవడమే గాక, రుణమాఫీని గాలికి వదిలేశారు. ఇప్పుడు దేవుళ్లపై ప్రమాణం చేసి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని హామీ ఇస్తున్నారు. ఏ ఏడాది ఆగస్టు 15 అనేది ఎక్కడా చెప్పడం లేదు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి పచ్చి దగా చేసిన కాంగ్రెస్పై ప్రజల్లో నమ్మకం పోయింది. ఆడబిడ్డల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం ఎటుపోయింది? 18 ఏళ్లు నిండిన మహిళకు రూ.2,500 ఏవీ?, సాగు, తాగునీరు ఏది? రూ. 4వేల పింఛన్ ఎప్పుడు అమలు చేస్తారు?. కాంగ్రెస్కు ప్రజాబలం ఉంటే ఈ నెల 19న సీఎం రేవంత్ మానుకోటకు వచ్చిన సందర్భంలో సభకు జనం రాక గంటన్నరపాటు బస్సులో ఎందుకు వేచి ఉన్నాడు? ఇది చాలదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందనేందుకు!
ఎంపీగా మీరు చేసిన అభివృద్ధి ఏంటి.
ఐదేళ్లలో మానుకోట పార్లమెంట్ పరిధిలో భద్రాచలం, మహబూబాబాద్, నర్సంపేట, ములుగులో మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలు ఏర్పాటు చేశాం. మానుకోటకు ఇంజినీరింగ్ కాలేజీ, మల్యాల ఉద్యాన డిగ్రీ కళాశాల, మహబూబాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ కోసం పెద్ద ఎత్తున నిధులు తెచ్చా. రాయగిరి మీదుగా భద్రాచలం వరకు నేషనల్ హైవే మంజూరైంది. పార్లమెంట్ పరిధిలో నాలుగు ఏకలవ్య పాఠశాలలు నడుస్తున్నాయి. నన్ను ప్రజలు ఆదరించి గెలిపిస్తే భద్రాచలం, బయ్యారం పెద్ద చెరువు, భీముని పాదం, లక్నవరం, పాకాల ప్రాంతాలను టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తా.
గిరిజన ఆడబిడ్డగా నన్ను మానుకోట పార్లమెంట్ పరిధిలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. ఏగ్రామంలోనైనా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తున్నారు. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా రైతులు, వృద్ధులు, మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలు చెబుతూ బాధపడుతున్నారు. మానుకోట పార్లమెంట్ పరిధి ఓటర్లకు నేనొక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. నిత్యం మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించే అభ్యర్థిని గెలిపించండి. ఓట్లు వచ్చినప్పుడే మీకు కనిపించే వారిని పక్కన పెట్టండి. కరోనా సమయంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఏమైనా సాయం చేశారా? కనీసం బాధితులకు ధైర్యం చెప్పేందుకైనా వచ్చారా ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ హక్కులు దక్కాలంటే పార్లమెంట్లో తప్పనిసరిగా బీఆర్ఎస్ అభ్యర్థులుండాలి. నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే లోక్సభలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకనవుతా.