న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ (Devender Yadav) నియమితులయ్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆదివారం కొత్త బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి కృషి చేస్తానని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే నాకు పెద్ద బాధ్యత అప్పగించారు. నాపై విశ్వాసం చూపిన కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా బాధ్యతలన్నింటినీ నెరవేర్చడానికి నేను కష్టపడి పని చేస్తానని వారికి హామీ ఇస్తున్నా. ఇవి కష్ట సమయాలు, కానీ మేం కలిసి పని చేస్తాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లో భారత కూటమి విజయం సాధించడాన్ని మీరు చూస్తారు’ అని మీడియాతో అన్నారు.
కాగా, ఏప్రిల్ 28న ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తుకు తాను వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన రాజీనామా లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం అరవిందర్ సింగ్ లవ్లీ మళ్లీ బీజేపీలో చేరారు.
మరోవైపు 2015లో కూడా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి అరవిందర్ లవ్లీ వైదొలగారు. 2017లో బీజేపీలో చేరిన ఆయన తొమ్మిది నెలల తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు. అయితే తాజాగా లోక్సభ ఎన్నికల వేళ మరోసారి ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన అరవిందర్ లవ్లీ మళ్లీ బీజేపీలో చేరారు.