Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయితే.. అబద్ధాలు చెప్పి రాహుల్ గాంధీ రాంగ్ గాంధీ అయ్యాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను హరీశ్రావు ఖండించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ రాహుల్ గాంధీతో సైతం అబద్ధాలు ఆడిస్తుందన్నారు. రాహుల్ గాంధీ నిర్మల్ సభలో మహిళలకు నెలకు రూ.2500 వేస్తున్నామని చెప్పి అబద్ధమాడారని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాహుల్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇయ్యని హామీలు ఇస్తున్నామని రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేయనందుకు రాహుల్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని.. ఆ తర్వాతే ఓట్లు అడగాలన్నారు. కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయ్యిందని.. ఈ విషయంలో ప్రతిరోజూ బీఆర్ఎస్ నిలదీస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తామని రాహుల్ చెబుతున్నాడని.. ‘కూట్లె రాయి తియనోడు ఎట్లె రాయి తిస్తాడట’ అన్నట్లుగా ఉందని విమర్శించారు. రాహుల్ గాంధీ హామీలు అమలు నాది బాధ్యత అని కర్ణాటక లో మోసం చేసి నేడు ఆరు గ్యారంటీలు తెలంగాణలో అమలు అవుతున్నాయని చెప్పి మోసం చేస్తున్నాడని విమర్శించారు.
మోదీ నల్లధనం తెస్తామని అబద్ధాలాడారని.. రాష్ట్రంలోని మహిళలు ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ నేతలను రూ.2500పై నిలదీయాలన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలపై తాను చర్చకు సిద్ధమేనని.. చర్చకు ఎక్కడికి రమ్మంటారో చెప్పాలన్నారు. తెలంగాణలోని రైతులు ఎకరానికి రూ.15వేలు ఏ అకౌంట్లో పడ్డాయో తెలుపాలని కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ అంటేనే కుట్ర, కపట నీతి అని.. పట్టపగలు రాహుల్ గాంధీ ఓట్ల కోసం దిగజారి మాట్లాడున్నారన్నారు. రాహుల్ తన స్థాయిని కాపాడుకోవాలంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీయేనని.. పేదరికానికి.. ఆకలికి కారణం కాంగ్రెస్ పార్టేనన్నారు. దేశంలో నిరుద్యోగం,పేదరికానికి కాంగ్రెస్, బీజేపీముద్దాయిలని.. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వసనీయత కోల్పోతుందన్నారు.