వరంగల్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓరుగల్లు పోరుగల్లు అని, పోరాటాలకు నిలయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్తో తనకు ఎంతో అనుబంధం ఉన్నదని చెప్పారు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ సారు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలోకి వచ్చారని, మలిదశ పోరాటంలో ఆయన కల నెరవేరిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీవ్రంగా అన్యాయం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతి పథంలో సాగిందని చెప్పారు. ఎస్సారెస్పీకి గతంలో నీళ్లు ఉండేవి కాదని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలో పంటలు పుష్కలంగా పండాయని అన్నారు. కాళేశ్వరం కట్టిన తర్వాతే పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో సాగునీరు అందిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్లో ఆకాశమంత ఎత్తులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించిందని అన్నారు. దేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కును పరకాల నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్మించుకున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, నర్సంపేటలో కొత్తగా మెడికల్ కాలేజీలను నిర్మించిందని చెప్పారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ తరపున పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం వరంగ్లో రోడ్ షో నిర్వహించారు. హనుమకొండ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఏమేమో చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చడం లేదని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్యాయం చేసిందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మోదీ గుజరాత్కు తరలించారని చెప్పారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదని అన్నారు. తెలంగాణకు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలించుకుపోతున్నదని అన్నారు. అడ్డుకోవాల్సిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరిస్తున్నదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వస్తే అచ్చేదిన్ వస్తాయని అన్నారని, ఇప్పుడు సచ్చేదిన్ వచ్చాయని విమర్శించారు. తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ తరపున స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి మోసగాడని, పిలిచి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ద్రోహం చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మూడు నెలల్లో కడియం శ్రీహరి పదవి పోతుందని, స్టేషన్ ఘన్పూర్ ఉపఎన్నికలో టి.రాజయ్య గెలుస్తారని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం తో కడియం శ్రీహరి తనకు తానే రాజకీయ సమాధి కట్టుకున్నారని అన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రె డ్డి, మాజీ ఎంపీ, జోగినపల్లి సంతోష్కుమార్, బీ ఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ చైర్మ న్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.వాసుదేవరెడ్డి, సుందర్రాజు, మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.