KCR | మహబూబ్నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):రాష్ట్రంలో కరెంట్ కోతలపై బీఆర్ఎస్ కేసీఆర్ మండిపడ్డారు. శనివారం మహబూబ్నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో బస చేసిన కేసీఆర్ ఎడాపెడా కరెంట్ పోతుండటంపై తన ఎక్స్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు మంత్రులు రాష్ట్రంలో కరెంట్ కోతలే లేవని చెప్తున్నారని, కానీ, సహచర పార్టీ నేతలతో కలిసి తాను ఉన్నప్పుడే రెండుసార్లు కరెంట్ పోయిందని, ఇది కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు.
‘తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట కిందట మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంట్ పోవటం లేదని ఉదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారివారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంట్ పోతున్నదని నాకు చెప్పారు. రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పరిపాలన వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి. జై తెలంగాణ’ అని కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాగా, పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేసీఆర్ ‘ఎక్స్(ట్విట్టర్)’లో ఖాతా తెరిచారు.‘బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని తొలి ట్వీట్ చేశారు. కేసీఆర్ ఎక్స్ ఖాతా తెరిచిన విషయం తెలియగానే నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆ ఖాతాను ఫాలో అవుతున్నారు. వ్యూస్, లైక్లు, ట్వీట్లు, రీట్వీట్లతో హోరెత్తించారు. శనివారం రాత్రి 9 గంటల సమయానికి తొలి ట్వీట్ను లక్షా 82 వేల మంది వీక్షించారు.