KCR : ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు. గోదావరి నీటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎత్తుకపోతనని ప్రధాని మోదీ చెప్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు నోరు తెరవడం లేదని నిలదీశారు. మన సమస్యలపై మాట్లాడని ఈ దద్దమ్మలు మనకెందుకు అని మండిపడ్డారు. ఖమ్మం రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
‘బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నడు. ముగ్గురు ఎంపీలు ఉన్నరు. బీజేపీ పార్టీ ఉంది. ప్రధాని నరేంద్రమోదీ క్లియర్గా ఒక మాట చెప్తున్నడు. గోదావరి నదిని నేను ఎత్తుకుని పోతా.. తమిళనాడుకు, కర్ణాటకకు ఇస్త అంటున్నడు. అంత మాట అంటుంటే ఒక్కడన్న మాట్లాడుతున్నడా..? కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతున్నడా..? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతున్నడా..? మరె మన హక్కుల గురించి, మన సమస్యల గురించి మాట్లాడని ఈ దద్దమ్మలు మనకు ఎందుకు..?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
‘మనకు ఉన్న ఒకే ఒక్క ఆశ గోదావరి. ఖమ్మం జిల్లాలో గత 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఎవరూ ఆలోచన చేయలే. కృష్ణా నదిలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోతున్నయ్. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామా ప్రాజెక్టును కడుతున్నం. 37 టీఎంసీల ప్రాజెక్టు అది. అది పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచుకు లోటు లేకుండా వ్యవసాయానికి నీళ్లు వచ్చే ప్రాజెక్టు అది. అట్లాంటిది పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి నేను కర్ణాటకకు, తమిళనాడుకు నీళ్లు తీసుకుపోతనంటే ఎందుకు వీళ్లు మాట్లాడుతలేరు..? ఇయ్యాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నోరు తెరువడం లేదు’ అని కేసీఆర్ నిలదీశారు.