ఇందూరు: అంతర్మథనం పుస్తకంతో సరికొత్తగా ఆలోచనలు చేసి కవిత్వాన్ని తీసుకవచ్చిన యువకవి క్రాంతికుమార్ నేటి యువతరానికి, సమాజానికి గొప్ప ఆదర్శమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అరుట్ల రాజేశ్వర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో క్రాంతికుమార్ రచించిన ‘అంతర్మథనం’ పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కవిత్వం సమాజ గతిని మార్చగల శక్తి కలదని, గ్రంథాలయాలు ఎన్నో సామాజిక, సాహిత్య ఉద్యమాలకు ఊతమిచ్చాయని, క్రాంతికుమార్ రచించిన అంతర్మథనం మంచి కవిత్వంతో సమాజ శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు.
సభాధ్యక్షుడు డాక్టర్ కాసర్ల నరేశ్రావు, పుస్తక ఆవిష్కర్త, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ క్రాంతి కవిత్వంలో గొప్ప పరిణతి ఉందని, క్రాంతిని తీర్చిదిద్దిన వారి గురువు రామేశ్వర్రెడ్డిని అభినందించారు. పుస్తక సమీక్ష చేసిన డాక్టర్ పింగళి గంగాధర్రావు, క్రాంతి రాసిన కవిత్వాన్ని విశ్లేషించారు. టీయూ ప్రొఫెసర్ డాక్టర్ త్రివేణి, రచయిత.. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్, గిరిరాజ్ కళాశాల తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ బోయినపల్లి ప్రభాకర్ క్రాంతిని అభినందించారు. ఆత్మీయ అతిథులుగా పీపీ చందన్రావు, నరాల సుధాకర్ పాల్గొని కవిత్వాన్ని వివరించారు. సభకు మద్దుకూరి సాయిబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కవి క్రాంతిని ఘనంగా సన్మానించారు. సభలో కవులు దారం గంగాధర్, తొగర్ల సురేశ్, ప్రవీణ్, చిన్నయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.