Bacteria | వాషింగ్టన్: సాల్మొనెల్లా వంటి పలు రకాల బ్యాక్టీరియాలు మనిషి రక్తంలోని రసాయనాల రుచిని గుర్తించగలుగుతున్నాయని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తేల్చారు. రక్తంలోని సీరంలో ఉండే సెరైన్ అనే అమైనో యాసిడ్ను బ్యాక్టీరియాలు గుర్తించి, ఆకర్షితమవుతున్నన్నాయనని వీరు జరిపిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘ఈలైఫ్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
రక్తానికి సంబంధించిన అంటువ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా మానవ రక్తంలోని రసాయనాలను కేవలం ఒక్క నిమిషం లోపే గుర్తించి, దాంట్లోకి చేరుతున్నదని తాము గమనించినట్టు ప్రొఫెసర్ ఆర్డెన్ బేలింక్ తెలిపారు. బ్యాక్టీరియాకు రక్తంలోని రసాయనాలను గుర్తించగలిగే సామర్థ్యం ఎలా ఉందో గుర్తిస్తే భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని నియంత్రించే కొత్త ఔషధాలను అభివృద్ధి చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. తద్వారా ఔషధ నిరోధకత కలిగిన వ్యాధికారకాలకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్తున్నారు.