భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 29 : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, వ్యయ పరిశీలకులు రాకేశ్రంజన్, సాయన్ దేబర్మ సమక్షంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యరులు, వారి ప్రతినిధులకు ఎన్నికల వ్యయంపై సోమవారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రేట్ కార్డు ప్రకారం అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మూడు రిజిష్టర్లలో ప్రతి రోజూ ఖర్చులు, క్యాష్ వివరాలు, బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మొత్తం మూడు సార్లు అభ్యర్థి లేదా అతను సూచించిన ప్రతినిధి ద్వారా ఎన్నికల ఖర్చు వివరాలు అందించాలని సూచించారు.
ఒకవేళ అందించకుంటే 1951 యాక్ట్ సెక్షన్ 10-ఎ కింద మూడు సంవత్సరాలు పోటీ చేయడానికి అర్హత కోల్పోతారని తెలిపారు. ప్రతి ఒక అభ్యర్థి రూ.95 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని, ఎన్నికలు అయిన తర్వాత రిటర్నింగ్ అధికారి వద్ద ఖర్చు ఫైనల్ రీకన్సిలేషన్ చేసుకోవాలని అన్నారు. సువిధ యాప్ ద్వారా ర్యాలీలు, సమావేశాలు, సభలకు సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతులు తీసుకోవాలని, అందులో తేదీ, సమయం స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె.గంగాధర్ పాల్గొన్నారు.