హైదరాబాద్, ఏప్రిల్29 (నమస్తే తెలంగాణ): బీసీల అభ్యున్నతిపై బీజేపీ తన వైఖరిని తేల్చాలని ప్రధాని మోదీకి రాష్ట్రంలోని 16 బీసీ సంఘాలు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. పదేండ్ల పాలనలో బీసీల అభివృద్ధికి ఏ ఒక్క పథకం అమలు చేయలేదని తెలిపారు.
కులగణన చేపట్టేందుకు ఎందుకు ఒప్పుకోవడం లేదని, బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 50 శాతానికి ఏ కారణంతో పెంచడం లేదని, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నదని, బడ్జెట్లో బీసీల కోసం రూ.2 లక్షలు కేటాయించాలని, సాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టళ్ల, గురుకుల పాఠశాలలు పెట్టాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.
జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను ఎందుకివ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగ ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని, అగ్రకులాల పేదలు 3శాతం ఉంటే ఎందుకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, కన్వీనర్ గుజ్జ కృష్ణ, నేతలు వెంకటేశ్, రామకృష్ణ, అనంతయ్య, రాజేందర్, కృష్ణయాదవ్, రామాంజనేయులు, మల్లేశ్యాదవ్, నర్సింహాగౌడ్, అంజి, బర కృష్ణ, వెంకన్నగౌడ్, మధుసూదన్, వెంకన్న, చంద్ర నిలదీశారు.