దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరిందని వింటూనే ఉన్నాం. ప్రపంచంలోని అనేక నగరాలను కలుషిత గాలి సమస్య పట్టిపీడిస్తున్నది. మరో పదేండ్లలో వాయు కాలుష్యంలో హైదరాబాద్ కూడా మరో ఢిల్లీగా మారనుందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి! రోజురోజుకూ పెరిగిపోతున్న వాయు కాలుష్య ప్రభావం ఊపిరితిత్తులపై తీవ్రంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవి..
కరోనా తగ్గాక మాస్కులు ధరించడం మానేశాం కానీ, రెగ్యులర్గా ధరించడం మంచిది. బయటికి వెళ్లాల్సి వచ్చినా, వాకింగ్, జాగింగ్ చేసేటప్పుడు కూడా మాస్క్ ఉండేలా చూసుకోవాలి.
ఇంట్లోనూ కలుషితమయ్యే గాలికి పరిష్కారాన్ని ఎంచుకోవాలి. ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్లను పెట్టుకుంటే మంచిది. క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. ఏరోబిక్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఊపిరితిత్తులను బలంగా ఉంచుతాయి. ధూమపానం అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. స్మోకింగ్ అలవాటు లేకపోయినా పాసివ్ స్మోకింగ్కి దూరంగా ఉండటం కూడా ముఖ్యమే.
ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు వైద్యులను సంప్రదించడం మంచిది.
సరిపడా నిద్ర కూడా ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోవాలి. తరచూ ఫ్లూ బారినపడుతున్న వాళ్లు.. వైద్యుడిని సంప్రదించి, తగిన సూచనలు పాటించడం చాలా అవసరం.
చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ప్రాంతాల్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల కాలుష్యం బారిన పడకుండా కొంతవరకైనా మనల్ని మనం కాపాడుకోవచ్చు.