కంటోన్మెంట్, ఏప్రిల్ 26: ‘మీ బిడ్డగా.. మీ ముందుకు వస్తున్న.. ఆశీర్వదించండి’ అంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఓటర్లను కోరారు. శుక్రవారం ఆమె ఒకటో వార్డు పరిధిలోని సెవన్ టెంపుల్, చిట్టిరెడ్డి కాలనీ, చిన్నతోకట్ట, నక్కలపల్లి బస్తీల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా స్థానికులతో మమేకమవుతూ.. ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ మోసం చేసిందని, ఆ పార్టీ మాటలు వింటే మరోసారి గోసపడుతామని చెప్పారు. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ గెలిస్తేనే అన్ని రంగాల్లో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.