Cell Phone Snatching |సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ స్నాచింగ్ నేరాలు నగరంలో వ్యవస్థీకృత నేరంగా మారుతున్నాయని, ఇందుకు ఇటీవల గుడిమల్కాపూర్లో జరిగిన దారుణ హత్యే నిదర్శనమని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు. గత నెల 30న అత్తాపూర్ పిల్లర్ నంబర్ 65 వద్ద ఫుట్పాత్పై ఉన్న యువకుడి సెల్ఫోన్ను స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించడం, అడ్డగించిన యువకుడిని హత్య చేసిన నిందితులను సౌత్వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీపెరుమాళ్, డీసీపీ అందె శ్రీనివాస్రావు వివరాలను వెల్లడించారు. గోల్కొండలోని బంజారీ దర్వాజా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఎజాజ్ ఖురేషి పాత నేరస్తుడు. 2022 నుంచి సెల్ఫోన్ స్నాచింగ్లు చేస్తున్నాడు.
చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, మైలార్దేవ్పల్లిలో ఆరు కేసులు నమోదు కాగా.. ఒక హత్యాయత్నం కేసు కూడా ఉంది. గంజాయికి అలవాటు పడ్డ ఎజాజ్, ఓ బాలుడిని తన అనుచరుడిగా చేసుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 29న కేపీహెచ్బీలో స్కూటీని చోరీ చేశారు. మరుసటి రోజు మైలార్దేవ్పల్లిలో సెల్ఫోన్ స్నాచింగ్కు పాల్పడి, అదేరోజు రాత్రి ద్విచక్ర వాహనంపై గుడిమల్కాపూర్కు చేరుకున్నారు. ఆ సమయంలో మురాద్నగర్కు చెందిన సనుల్లా తన సోదరుడితో కలిసి స్నేహితుడి దుకాణం వద్ద కూర్చుకున్నారు. ఆ సమయంలో ఎజాజ్ తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. వెనుక కూర్చున్న బాలుడు.. సనుల్లా చేతిలో ఉన్న ఫోన్ను లాక్కోవడంతో అక్కడున్న యువకుడు ప్రతిఘటించి, వాహనంపై ఉన్న ఎజాజ్ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఎజాజ్ తన వద్ద ఉన్న కత్తితో సనుల్లాపై దాడి చేసి హత్య చేశాడు. ఎజాజ్తో పాటు బాలుడిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, వాహనం, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
సెల్ఫోన్లను స్నాచింగ్ చేసి, వాటిని అమ్మడం, విదేశాలకు అడ్డదారిలో పంపించే ముఠాను ఇటీవల పట్టుకున్నాం.. జరుగుతున్న స్నాచింగ్ ఘటనలు, ముఠాలను చూస్తే ఇది వ్యవస్థీకృత నేరాలుగా మారినట్లు స్పష్టమవుతోందని సీపీ అన్నారు. ఈ కేసులో పట్టుబడ్డ నేరగాళ్లపై పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు. సెల్ఫోన్ స్నాచింగ్ ఘటనలో బాధితులు సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో అది ఇండియాలో ఎక్కడైనా డిటిక్ట్ అవుతుందన్నారు. దీంతో నేరగాళ్లు ఇక్కడ చోరీ చేసిన ఫోన్లను సూడాన్, శ్రీలంక, బంగ్లాదేశ్కు అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. జగదీశ్ మార్కెట్పై నిఘా ఉన్నదని, ఇంకా ఎక్కడైనా ఇలాంటి కేంద్రాలు ఉన్నాయా..! అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అక్కడ పెట్రోలింగ్ వాహనాలు ఎందుకు తిరగడం లేదనే కోణంలో విశ్లేషిస్తున్నామని తెలిపారు. అర్ధరాత్రి, ఒంటరిగా వెళ్లే సమయంలో సెల్ఫోన్ను జాగ్రత్తగా ఉంచుకోవాలని సీపీ సూచించారు.