Houthi rebels : ఎర్రసముద్రం (Red Sea) లో వాణిజ్య నౌకలపై దాడుల పరంపర మరోసారి తీవ్రరూపం దాల్చింది. తాజాగా సౌదీఅరేబియా (Saudi Arabia) నైరుతి తీరంలో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్పై గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగింది. దాంతో నౌకలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. యునైటెడ్ కింగ్డమ్ మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
సౌదీలోని అల్ షుకైక్ ప్రాంతానికి నైరుతి దిశలో సుమారు 70 నాటికల్ మైళ్ల (130 కిలోమీటర్లు) దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సముద్ర పర్యావరణానికి కూడా ఇప్పటివరకు ఎలాంటి విఘాతం కలుగలేదని అధికారులు ప్రకటించారు. ఘటన జరిగిన వెంటనే సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని తామే సైనిక దాడి జరిపినట్లు యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ వర్గం అధికారికంగా వెల్లడించింది.
సౌదీ ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలపై దిగ్బంధం విధించిందనే ఆరోపణలతో సౌదీకి చెందిన నౌకలపై సముద్ర నిషేధాన్ని విధిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే హౌతీలు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ దాడి జరిగింది. కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధికి సమీపంలో ఈ దాడి జరగడంవల్ల పశ్చిమాసియాలో సముద్ర మార్గ భద్రతపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ప్రసిద్ధ నౌకాయాన విశ్లేషణ సంస్థ ‘క్లెప్లర్’ కథనం ప్రకారం.. సెక్యూరిటీ పరిస్థితులు వేగంగా దిగజారడంతో హర్మూజ్ జలసంధి, బాబ్ ఎల్-మండేబ్ జలసంధి రెండింటి ద్వారా జరిగే ఓడల రాకపోకలు గణనీయంగా పడిపోయాయి. హౌతీల హెచ్చరికల నేపథ్యంలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ సమీపంలో అనేక వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని నిలిపివేసి వెనక్కి మళ్లినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ కీలక జలసంధులలో నిరంతరం జరిగే దాడులవల్ల గ్లోబల్ షిప్పింగ్ మార్గాలు మారిపోవడమే కాకుండా సరుకు రవాణా ఛార్జీలు (ఫ్రైట్ ఛార్జీలు) విపరీతంగా పెరిగి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావంపడే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.