Manchu Lakshmi | దేశంలో జరుగుతున్న సామాజిక, ప్రజా సమస్యలపై ప్రతి పౌరుడు బాధ్యతగా స్పందించాలని ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి పిలుపునిచ్చారు. మనకెందుకులే అనే నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రతి ఒక్కరూ తమ స్వరం వినిపించాలని ఆమె కోరారు. తాజాగా రాజ్యాంగ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు మద్దతుగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో దేశంలో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ప్రజల్లో సామాజిక బాధ్యత పెరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ, దేశంలో కీలకమైన సమస్యలు ఎదురవుతున్నప్పుడు చాలామంది వాటిని తమకు సంబంధం లేని విషయాలుగా భావించి మౌనం పాటిస్తున్నారని అన్నారు. కానీ అలాంటి వైఖరి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనాల్సిన అవసరం లేకపోయినా, కనీసం సమస్యలపై మాట్లాడటం, చర్చించడం, సోషల్ మీడియా ద్వారా స్పందించడం కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. సోనమ్ వాంగ్చుక్ వంటి వ్యక్తులు ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని మంచు లక్ష్మి తెలిపారు. ఆయన ఆశయాలను తాను గౌరవిస్తున్నానని, సమాజ ప్రయోజనాల కోసం పోరాడే వ్యక్తులకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
అలాగే రాజకీయాలపై విమర్శలు చేయడం కంటే, దేశ భవిష్యత్తు, రాబోయే తరాల సంక్షేమం కోసం బాధ్యతతో స్పందించడం ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ నిశ్శబ్దంగా ఉండటం తనను బాధిస్తోందని, సమస్యల పరిష్కారం కోసం ప్రజలంతా చొరవ చూపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మంచు లక్ష్మి విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె సందేశానికి పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతూ, ప్రజా సమస్యలపై అవగాహన పెంచే ప్రయత్నాలను అభినందిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న అంశాలపై స్పందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆమె చేసిన పిలుపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.