ఖలీల్వాడి, ఏప్రిల్ 26: పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని గెలిపింపించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 37వ డివిజన్లోని మైసమ్మ మందిరం, కెనాల్ కట్ట వద్ద బాజిరెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాముడు కోసం లక్ష్మణుడిలా నిరంతరం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రశ్నించే గొంతుకను గెలిపించుకోవడమే లక్ష్యమని, బాజిరెడ్డి భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 50 ఏండ్లలో జరగని అభివృద్ధి కేసీఆర్ హయాం లో పదేండ్లలో జరిగిందని గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్, సాగునీరందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుమని పది రోజులు కాక ముందే కరెంట్ కట్చేస్తున్నదని విమర్శించారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రచారంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, డివిజన్ అధ్యక్షుడు ప్యాట సంతోష్, నాయకులు ప్రభాకర్రెడ్డి, సుజిత్సింగ్ ఠాగూర్, సత్యప్రకాశ్, నరేశ్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.