Black Dahlia Murder Mystery | బ్లాక్ డహ్లియా.. ప్రపంచంలోనే అతి పెద్ద మిస్టరీ కేసు అది. అలా అని చనిపోయింది పెద్ద సెలబ్రెటీ ఏమీ కాదు. ఒక సాధారణ అమ్మాయి. సినిమాల్లో ఛాన్స్ల కోసం అమెరికా వీధుల్లో తిరుగుతున్న మామూలు యువతి. కానీ ఆమె హత్యకు గురైన తీరు ప్రపంచం మొత్తా్న్ని గడగడలాడించింది. ఒంట్లో చుక్క రక్తం కూడా లేకుండా.. రెండు ముక్కలైన డెడ్ బాడీ రోడ్డు మీద కనబడటంతో అప్పట్లో అమెరికా మొత్తం హడలిపోయింది. హత్యకు సంబంధించిన చిన్న క్లూ కూడా దొరక్క తలలు పట్టుకుంటున్న పోలీసులకు.. హత్య చేసింది మేమేనంటూ వందలాది మంది వచ్చి లొంగిపోవడం కూడా సంచలనం సృష్టించింది. మరి నిజంగా వారే హంతకులా అంటే అదీ కాదు. దశాబ్దాలు గడిచినా అమెరికా చరిత్రలో మిస్టరీగా ఉండిపోయిన ఈ కేసులో చనిపోయింది ఎవరు? ఆమెను ఎవరు హత్య చేశారు? అంత కిరాతకంగా హత్య చేసేందుకు కారణమేమై ఉంటుంది?
బ్లాక్ డహ్లియా కేసు1947 జనవరి 15న మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్లో తన మూడేళ్ల కుమార్తెతో కలిసి ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళకు ఓ యువతి మృతదేహం కనిపించింది. అది చూసి ఆమె వెన్నులో వణుకుపుట్టింది. భయం భయంగానే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు కూడా డెడ్బాడీని చూసి హడలెత్తిపోయారు. వాళ్లంతా అంతలా భయపడిపోవడానికి కారణం డెడ్ బాడీ కనిపించిన విధానం. రోడ్డు పక్కన తుప్పల్లో కనిపించిన ఆ మృతదేహం రెండు ముక్కలై ఉంది. అంటే ఆమె నడుము భాగాన్ని ఎవరో రెండుగా నరికేశారు. శరీరమంతా కత్తితో కోశారు. ఒక రొమ్మును చీల్చేశారు. చిత్రహింసలు పెట్టి చంపేశారు. నవ్వుతున్నట్లు కనిపించేలా పెదాలను చీల్చేశారు. కడుపులోని పేగులను కూడా పూర్తిగా తొలగించారు. ఆ తర్వాత రెండు కాళ్లను వెడల్పుగా చాపి.. ఒక చేతిని తలపై పెట్టుకుంటున్నట్లుగా మృతదేహాన్ని అక్కడ పడేసి వెళ్లిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అంతే దారుణంగా చంపేసినా కూడా అక్కడ ఒక్క చుక్క నెత్తురు కూడా లేదు. అంటే ఆమెను వేరే ఎక్కడో దారుణంగా హింసించారు. ఆమె శరీరంలో నుంచి రక్తం మొత్తాన్ని తీసేశారు. ఆ తర్వాత రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో ఇంత పెద్ద క్రైమ్ జరగడం ఇదే తొలిసారి. దీంతో ఈ కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. కానీ హంతకుడు ఎవరో కనిపెట్టడానికి ముందు చనిపోయింది ఎవరో తెలుసుకోవాల్సిన సవాలు వచ్చిపడింది. ఆమె ఎవరో కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా ఆమె ఫింగర్ప్రింట్స్ తీసుకుని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐకి పంపించింది. తమ వద్ద ఉన్న డేటాను పరిశీలించిన ఎఫ్బీఐ.. చనిపోయింది బోస్టన్కు చెందిన 22 ఏండ్ల ఎలిజబెత్ షార్ట్ ( Elizabeth short ) అని గుర్తించింది. 1943లో ఎలిజబెత్ షార్ట్ ఓ మద్యం కేసులో అరెస్ట్ అయ్యింది. అంతేకాదు గతంలో ఒకసారి ఆర్మీలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలో తీసుకున్న ఫింగర్ప్రింట్స్ తమ డేటాబేస్లో పొందుపరచడం వల్లనే ఈ కేసులో చనిపోయింది ఎలిజబెత్ అని ఎఫ్బీఐ గుర్తించగలిగింది. ఎలిజబెత్ 1924లో బోస్టన్లో జన్మించింది. ఆమెకు 18 ఏండ్లు నిండిన తర్వాత తల్లి దగ్గర నుంచి కాలిఫోర్నియాలో ఉంటున్న తండ్రి వద్దకు వచ్చింది. కానీ తండ్రితో కూడా విబేధాలు రావడంతో లాస్ ఏంజెలిస్కు వెళ్లిపోయింది. అక్కడే ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. పొట్టకూటి కోసం వెయిట్రెస్గా కూడా పనిచేసింది.
చనిపోవడానికి కొద్దిరోజుల ముందు సేల్స్ మ్యాన్గా పనిచేసే తన బాయ్ఫ్రెండ్ రాబర్ట్ మ్యాన్లీతో కలిసి శాన్డీగో వెళ్లింది. అక్కడి నుంచి 1947 జనవరి 9న లాస్ ఏంజెలిస్కు తిరిగివచ్చింది. వచ్చిరాగానే బోస్టన్ నుంచి వచ్చిన తన సోదరిని కలవాలని చెప్పడంతో ఎలిజబెత్ను మ్యాన్లీ బిల్ట్మోర్ హోటల్ వద్ద దింపేశాడు. బిల్ట్మోర్ హోటల్ లాబీలో ఎలిజబెత్ ఒక ఫోన్ మాట్లాడింది. అక్కడి నుంచి హోటల్కు సమీపంలో ఉన్న క్రౌన్ గ్రిల్ కాక్టెయిల్ లాంజ్కు వెళ్లింది. ఆ తర్వాత ఎలిజబెత్ కనిపించకుండా పోయింది. వారం రోజులకు ఆమె మృతదేహం కనిపించింది.
1946లో ది బ్లాక్ డహ్లియా అనే సినిమా వచ్చింది. ఆ మూవీలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురవుతుంది. ఆమెను చంపిన హంతకుణ్ని ఎలా పట్టుకున్నారనేదే ఈ మర్డర్ మిస్టరీ కథ. ఈ సినిమా విడుదలైన ఏడాదికే ఎలిజబెత్ హత్యకు గురైంది. యువతి హత్యకు గురవ్వడం.. హంతకుడు పోలీసులకు చిక్కకపోవడం వంటి విషయాలన్నీ అప్పటి జనాలకు ఆ సినిమా తరహాలోనే కనిపించాయి. దీంతో అందరూ బ్లాక్ డహ్లియా కేసు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ పేరు పాపులర్ కావడంతో పోలీసులు కూడా అధికారికంగా బ్లాక్ డహ్లియా కేసుగా మార్చేశారు.
బ్లాక్ డహ్లియా కేసు పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. ఎన్ని విధాలుగా దర్యాప్తు చేసినా హంతకులకు సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇలా ఈ కేసు పాపులర్ కావడంతో పోలీసులకు మరో చిక్కు వచ్చి పడింది. కేసు దర్యాప్తు ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే దాదాపు 60 మంది వచ్చి పోలీసులకు లొంగిపోయారు. ఎలిజబెత్ను చంపింది తామేనని నేరం ఒప్పుకున్నారు. కానీ పోలీసుల విచారణలో వారంతా నిర్దోషులేనని తేలింది. దీంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీరియల్ కిల్లర్స్ అందర్నీ ఒక జాబితా చేసి విచారణ జరిపారు. వాళ్లెవరూ ఎలిజబెత్ను చంపలేదని తేలింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడూ ఎలిజబెత్ను చంపింది తామేనంటూ లొంగిపోతూనే ఉన్నారట. అలా 500 మందికి పైగానే ఎలిజబెత్ హంతకులమని ఒప్పుకున్నారట. కానీ వాళ్లు అందరూ నిర్దోషులేనని విచారణలో తేలింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఎలిజబెత్ హత్య జరిగిన సమయానికి పుట్టని వాళ్లు కూడా హంతకులమేనని స్టేషన్కు వచ్చేవారంట. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ బ్లాక్ డహ్లియా కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. అన్నట్టు ఈ బ్లాక్ డహ్లియా హత్య కేసు మీద పలు క్రైమ్ థిల్లర్ బుక్స్ కూడా వచ్చాయి.
శత్రువులను అడ్డుకోవాలన్న తపనలో.. పొరపాటున వాళ్ల దేశంలోనే కోట కట్టారు