హుజూరాబాద్ : బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ను కరీంనగర్ మేయర్ సునీల్రావు ప్రశ్నించారు. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలను ఈటల రాజేందర్ ఓటు అడిగే అర్హత లేదన్నారు. గ్యాస్ , పెట్రోల్, డిజీల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యులపై భారం మోపినందుకా… నల్లచట్టాలను తెచ్చి రైతులకు అన్యాయం చేసినందుకా… నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులను కార్లతో తొక్కి చంపినందుకు ఓటేయ్యాలా అని ప్రశ్నించారు.
రాజేందర్ నియోజకవర్గ ప్రజలను కించపరిచేలా పదేపదే మాట్లాడటం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎసోళ్లు మద్యం, డబ్బులు ఎరవేస్తూ ప్రజలను ప్రలోభాలు పెడుతున్నారని ఈటల మాట్లాడడం ప్రజలను కించపరిచినట్లేనన్నారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు అని ఎవరిని అక్కున చేర్చుకోవాలో, ఎవరిని బొంద పెట్టాలో వాళ్లకు తెలుసునని హితవు పలికారు. ఇప్పటి వరకు ఈటల సుమారు వంద కోట్లు ఖర్చు పెట్టడమే కాక టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతుందని బద్నాం చేయడం సమంజసం కాదన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుందని అంటున్న నువ్వు బొట్టుపిల్లలు, గడియారాలు, గొడుగులు, గ్రైండర్లు, కుట్టుమిషన్లు పంచినా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో రాజేందర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. పైగా దొంగే దొంగ అన్న చందంగా టీఆర్ఎసోళ్లు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారనడం హస్యస్పదమన్నారు. నియో జకవర్గంలో మొదటి నుంచి టీఆర్ఎస్ బలంగా ఉందని, ఆయన పార్టీలోకి రాక ముందే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఎంపికైన ఘనత ఉందన్నారు.
నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న టీఆర్ఎస్ టికెట్ను ఇవ్వడంతో ఈటల గెలుపొందాడే తప్ప ఆయనకంటూ సొంత బలం ఏమిలేదన్నారు. ఆరుసార్లు కేవలం కేసీఆర్ చరిష్మా, కారు గుర్తు మీద రాజేందర్ గెలిచి కేసీఆర్ను విమర్శించడం సిగ్గు చేటన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలను మద్యానికి అమ్ముడు పోతున్నారని కించపరిచేలా మాట్లాడుతుండడం దేనికి సంకేతమన్నారు. బీజేపీ పార్టీ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పి ఓట్లు అడుగాలని డిమాండ్ చేశారు. రాజేందర్ ఎక్క డైనా గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరల పెంపు గురించి మాట్లాడుతున్నావా… ధరలు తగ్గిస్తామని కనీసం ఎక్కడైన చెబు తున్నావా అని ప్రశ్నించారు.
సామాన్య ప్రజల నడ్డీ విరిచేది బీజేపీ అయితే టీఆర్ఎస్ కడుపులో పెట్టి చూసుకుంటుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలపై మాట్లాడిన ఈటల రాజేందర్కు వాటిని రద్దు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందా… వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఈటల ద్వంద వైఖరి అనుసరిస్తున్నాడని, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే ధరలు తగ్గించేలా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని హితవు పలికారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్న ఈటల ఓటర్లను కొనే ప్రయ త్నం చేస్తున్నాడని కానీ ప్రజలు చైతన్యవంతులని పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని అన్నారు. దుర్మార్గ పనులు ఆయన చేస్తూ ఎదుటివాళ్ల మీద దుష్ర్పచారం చేయడం ఎంతవరకు సమంజనం అన్నారు.
రైతన్నల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నది రైతన్నకు అండగా ఉన్నది టీఆర్ఎస్ అయితే కరెంట్ మోటర్లకు మీటర్ భిగించాలని చూస్తుంది బీజేపీ పార్టీ అన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ ఎంతో కష్టపడి రైల్వే లైన్ కాజీపేట నుండి హుజూరాబాద్ మీదుగా కరీంనగర్ వరకు తీసుకురాగా కేంద్రం దానిని రద్దు చేసిందని, దీని గురించి ప్రజలకు సమాధానం ఏం చెబుతావన్నారు. రైల్వే లైన్ రద్దు కావడంతో ఇక్కడి ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని, ఈ లోటును ఎలా పూడ్చుతావన్నారు.
ఈటల ఓటమి ఖాయమైందని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కార్పొటర్ పిట్టల శ్రీనివాస్, నాయకుడు బత్తుల రాజలింగం తదితరులు ఉన్నారు.