న్యూఢిల్లీ : అస్సాం శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం ప్రధాని మోదీ గోలఘాట్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మరోసారి రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రధాని ఓటర్లను అభ్యర్థించారు. అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఎన్డీఏ మరింత అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ జోర్హాట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెప్పాలని ఓటర్లను అభ్యర్థించారు.
సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలోని దిబ్రూఘర్, జోర్హాట్, బిశ్వనాథ్ ఛరాలిలో జరుగనున్న ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. 126 స్థానాలున్న అస్సాం శాససనభకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 27న తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానుండగా.. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రంలో 2016 వరకు 15 ఏండ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అనంతరం 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, అస్సాం గణపరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) కూటమిగా పోటీ చేసి 86 స్థానాలు గెలిచాయి.