హైదరాబాద్, ఫిబ్రవరి 28 : ప్రధాని మోదీ దగ్గరి నుంచి బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్చుగ్ దాకా అందరూ టూరిస్ట్లేనని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పగిడీ, తమిళనాడు ఎన్నికల్లో లుంగీతో వేషాలు వేస్తూ మోదీ టూరిస్ట్గా మారారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను పొలిటికల్ టూరిస్ట్ అంటూ తరుణ్చుగ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించడాన్ని జీవన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. బీజేపీ నేతల వ్యవహార శైలిని తప్పుబట్టారు. పంజాబ్లో ఓడిపోయిన తరుణ్చుగ్కు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని తేల్చిచెప్పారు. తరుణ్చుగ్ ఇంట గెలిచి రచ్చగెలవాలని సూచించారు. ప్రశాంత్కిశోర్ను సీఎం కేసీఆర్ వ్యూహకర్తగా చేసుకుంటే తరుణ్చుగ్కు వచ్చిన తిప్పలు ఏమిటని ప్రశ్నించారు. ఇదే ప్రశాంత్కిశోర్ గతంలో ప్రధాని మోదీ దగ్గర నాలుగైదేండ్లు వ్యూహకర్తగా పనిచేసిన విషయాన్ని తరుణ్చుగ్ మరిచిపోయారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తప్పకుండా ప్రధాని అవుతారని, ఈ దేశాన్ని దారిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రపంచానికి మార్గదర్శనం చేసే సత్తా ఆయనకు ఉన్నదని స్పష్టం చేశారు. తరుణ్చుగ్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ టూరిస్ట్ బీజేపీ నేతలు తమ వ్యవహారశైలిని మార్చుకోకపోతే రాష్ట్రంలో కాలుపెట్టనీయబోమని తేల్చిచెప్పారు.