హైదరాబాద్, ఫిబ్రవరి 3 : బీజేపీది గాడ్సేయిజం అని, టీఆర్ఎస్ది అంబేద్కరిజం అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలున్న ప్రాంతాల్లో జైభీమ్ – బడ్జెట్లో నై భీమ్, ఎన్నికల్లో జై కిసాన్ – బడ్జెట్లో నై కిసాన్ బీజేపీ విధామని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ రాష్ర్టానికో వేషం వేస్తూ, ప్రాంతానికో మోసం చేస్తున్నారని విమర్శించారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ది అంబేద్కర్ ఆలోచనా విధానమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా అమ్మకుండా ఉండేందుకే కేసీఆర్ కొత్త రాజ్యాంగ ప్రతిపాదన చేశారని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణ సాధించారని, అలాగే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చేవరకు పోరాటం చేస్తారని తేల్చిచెప్పారు.
నరేంద్ర మోదీ అంటే నక్కజిత్తుల మోసగాడు
నరేంద్ర మోదీ(నమో) అంటే నక్కజిత్తుల మోసగాడు అని జీవన్రెడ్డి దుయ్యబట్టారు. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టడమే కేంద్ర విధానమా? అని నిలదీశారు. గాంధీని చంపిన గాడ్సేకు సెల్యూట్ కొట్టే పార్టీ బీజేపీ అని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రేరేపించింది ఆ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికలున్నప్పుడు మేకప్లు.. తర్వాత ప్యాకప్ బీజేపీ విధానం అని మండిపడ్డారు. కులాలు, మతాల పేరుతో రాజకీయం చేయటం బీజేపీకి అలవాటైన విద్య అని విమర్శించారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ కాంగ్రెస్, బీజేపీ విధానమని అన్నారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకొన్నాకే సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగ ప్రతిపాదనను రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ను, కేసీఆర్ను అంబేద్కర్ వ్యతిరేకిగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జపాన్, ఫ్రాన్స్, నేపాల్ లాంటి చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చుకొన్నాయని ఆయన గుర్తుచేశారు.
అంబేద్కరే మార్చాలన్నారు!
గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రాజ్యాంగం అవసరమని చెప్పారని అన్నారు. దానిపై విస్తృత చర్చ జరగాలని తెలిపారు. తాను రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే మార్పు చేయాల్సిందేనని స్వయంగా అంబేద్కర్ పేర్కొన్న విషయాన్ని బాలరాజు గుర్తుచేశారు. దేశంలో 40 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలు ఉంటే కేంద్ర బడ్జెట్లో కేవలం రూ. 12వేల కోట్లు ప్రతిపాదిస్తారా? అని నిలదీశారు. అంబేద్కర్పై ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్న బీజేపీ నేతలు ఆ మహనీయుడిని అనేక విధాలుగా అవమానాల పాలుచేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీసు చట్టమన్న ఎంపీ అర్వింద్పై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని గువ్వల బాలరాజు నిలదీశారు.