బీజేపీ బరితెగిస్తున్నది. విద్వేషాలను రెచ్చగొడుతూ.. వివాదాలకు ఆజ్యం పోస్తున్నది. ఎలాగైనా సరే.. ఏదో ఒక హింసాత్మక ఘటనకు పాల్పడి తన ఉనికిని కాపాడుకునేందుకు అనవసర రాద్ధాంతం చేస్తూ.. అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. ప్రధానంగా సిరిసిల్లను టార్గెట్గా చేసుకొని.. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో విషసంస్కృతికి బీజం వేస్తున్నది. గతేడాది ఇల్లంతకుంట ఠాణా సాక్షిగా దౌర్జన్యానికి దిగడం, ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో దళితులపై దాడి చేయడం.. తాజాగా టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై వందలాది మంది మూకుమ్మడిగా దాడికి తెగబడడం కమలం మూకల విధ్వంసరచనకు నిదర్శనంగా నిలుస్తున్నది. బిహార్, యూపీ గూండాల తరహాలో చేతిలో కర్రలు, రాళ్లు పట్టుకొని వీరంగం సృష్టించడమే కాకుండా, అక్కడున్న రెండు కార్లను ధ్వంసం చేయడం హింసా ప్రవృత్తికి అద్దం పట్టింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పెను ముప్పు తప్పింది.ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా శ్రేణులు వ్యవహరిస్తున్నా ఆ పార్టీ పెద్దలు ఖండించక పోగా.. వారికే వంత పాడుతున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /ఎల్లారెడ్డిపేట : బీజేపీ విష సంస్కృతికి తెరతీస్తున్నది. విద్వేషాలను రెచ్చగొడుతూ.. బిహార్, యూపీ తరహాలో గూండాయిజానికి దిగుతున్నది. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తెరపైకి తేవడం.. దాన్ని రాద్ధాంతం చేసి ఉనికి చాటుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన బీజేపీ నాయకుడు రేపాక రామచంద్రారెడ్డి అసభ్య పదజాలంతో సోషల్మీడియాలో పోస్టు పెట్టగా, దీనిపై టీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో బీజేపీ నాయకులు వారి ప్లాన్ను అమలు చేశారు. ఎలాగైనా సరే విషయాన్ని వివాదం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత దూషణ, అత్యంత నీచమైన పదజాలంతో పోస్టులు పెట్టారు. అక్కడితో ఆగకుండా.. ఆ పార్టీ జిల్లా నాయకుడు రెడ్డబోయిన గోపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్స్టేషన్కు వెళ్లి శుక్రవారం టీఆర్ఎస్ నేతలపై కేసు పెట్టే ప్రయత్నం చేశారు. అభ్యంతరకర పోస్టులు పెట్టిందేగాక, తిరిగి తమపైనే ఎలా కేసు పెడుతారంటూ టీఆర్ఎస్ శ్రేణులు సైతం కేసు పెట్టేందుకు ఠాణాకు వెళ్లారు. ఇక్కడ బీజేపీ నాయకులు ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్టేషన్కు వెళ్లి, టీఆర్ఎస్ శ్రేణులను సముదాయించి పంపించారు. తర్వాత ఆయన కూడా ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ఈ తరుణంలో పోలీసులు ఎంత చెప్పినా బీజేపీ నాయకులు వినకుండా ఠాణా ఎదుటే ఆందోళనకు దిగి, పోలీసులతోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత కర్రలు, రాళ్లు పట్టుకొని.. రోడ్లపై స్వైరవిహారం చేస్తూ ఆగయ్య ఇంటిపై దాడికి యత్నించారు. ఈ సమయంలో ఆగయ్య ఇంటి వద్ద ఉన్న ఇద్దరు ఎస్టీ సర్పంచుల కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా.. ఆగయ్య ఇంటిని ధ్వంసం చేయడంతోపాటు అతనిపైనా దాడికి యత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, లేదంటే ఆగయ్యకు ప్రాణహాని జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఆగయ్య ఇంటిపై దాడిని లోతుగా చూస్తే.. ఈ నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నది కాదని అర్థమవుతున్నది. నిజానికి పోలీస్స్టేషన్కు ఆగయ్య ఇంటికి మధ్య అర కిలోమీటర్ దూరముంటుంది. ఠాణా ఎదుట ధర్నా చేసిన సమయంలో బీజేపీ నాయకుల చేతుల్లో కర్రల్లేవు. కానీ, ఎప్పుడైతే ఆగ య్య ఇంటిపై దాడికి బయలు దేరారో.. స్టేషన్ను నుంచి కొంత దూరం వెళ్లారో లేదో.. చాలా మంది చేతుల్లోకి కర్రలు వచ్చి చేరాయి. మరికొంత మంది చేతిలో రాళ్లు, కర్రలు కనిపించాయి. నిజానికైతే ఆ రాత్రి అక్కడ కర్రలు దొరికే పరిస్థితి ఉండదు. కానీ, ముందుస్తు ప్లాన్లో భాగంగానే బీజేపీ నా యకులు దారి పొడవునా.. అక్కడక్కడా కర్రలు, రాళ్లు దాచి ఉంచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ ఫుటేజీలనుచూస్తే ఈఅనుమానాలు బలపడుతున్నాయి. ఒక్క మా టలో చెప్పాలంటే.. ఎలాగైనా సరే పోలీసులు, టీఆర్ఎస్ నా యకులతో గొడవ పడడమేకాదు, ఆగయ్య ఇంటిపై దాడికి పూనుకొని.. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలన్న పక్కాప్లాన్లోనే ఇదంతా జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గులాబీ పార్టీకి అక్కడ తిరుగులేదు. బీజేపీకి చోటు లేదు. దీంతోపాటు అక్కడ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాద్ధాంత రాజకీయాలు చేసి, ఎలాగైనా ఒక అలజడి సృష్టించాలన్న లక్ష్యంతో అదినాయకత్వం ఆదేశాల మేరకు.. అక్కడి బీజేపీ నాయకులు పనిచేస్తున్నట్లు గా కనిపిస్తున్నది. ఇందుకు గతంలో జరిగిన అనేక సంఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. గతేడాది ఏప్రిల్లో ఇల్లంతకుంట మండలంలో జరిగిన కేటీఆర్ కార్యక్రమాన్ని బీజేపీ, ఏబీవీపీ నాయకులు పక్కా ప్లాన్తో అడ్డుకోవడమే కాదు, టీఆర్ఎస్ నాయకులపై పోలీస్స్టేషన్ సాక్షిగా దాడికి పూనుకున్నారు. అప్పుడు మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ, ఏబీవీపీ నాయకులను పిలిపించారు. ఆరోజు ఇల్లంతకుంటలో కార్యక్రమాలన్నీ ముగించుకొని సిరిసిల్లకు బయలు దేరే సమయంలో రైతువేదిక వద్ద ఒక్కసారిగా ఏబీవీపీ, బీజేపీ నాయకులు మంత్రి కాన్వాయికి అడ్డుపడ్డారు. వీరంగం సృష్టించే ప్రయ త్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సదరు నాయకులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. మంత్రి క్వాన్వాయికి అడ్డుపడిన ఏబీబీవీ, బీజేపీ నాయకులపై ఫి ర్యాదు చేయడానికి టీఆర్ఎస్ నాయకులు స్టేషన్కు వెళ్లారు. అప్పటికే అక్కడికి ఉమ్మడి జిల్లా నుంచి చేరుకున్న ఏబీబీపీ, బీజేపీ నాయకులు.. టీఆర్ఎస్ నాయకులు స్టేషన్లోకి అడుగుపెట్టడమే ఆలస్యంఅన్నట్లు.. ముందుగా టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడి కారును ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా టీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగి, దాడికి పూనుకున్నారు. ఠాణా వద్ద ఉన్నామన్న విషయాన్ని సైతం పక్కన పెట్టి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అలాగే, గతేడాది జనవరిలో ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో దళితులపై దాడులు చేశారు. అంతేకాదు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి సృష్టించడం.. ఒక రివాజుగా మార్చుకున్నారు. సిరిసిల్ల కేంద్రంగా జరుగుతున్న ఈవ్యవహారం వెనుక కొంతమంది బీజేపీ అగ్రనాయకుల హస్తం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా బీజేపీ శ్రేణులు వ్యవహరిస్తున్నా ఖండించక పోగా.. వారికే వంత పాడడం పెద్దలహస్తం ఉందని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది.
ఎల్లారెడ్డిపేట /గాంధీ చౌక్, మార్చి 19: టీఆర్ఎస్ నాయకులపై శుక్రవారం జరిగిన దాడి ఘటనలో 27 మంది బీజేపీ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు సీఐ మొగిలి తెలిపారు. ఇందులో రెడ్డబోయిన గోపి, పొన్నాల తిరుపతిరెడ్డి, మేడిశెట్టి బాలయ్య, మద్దుల బుగ్గారెడ్డి, మాలోత్ సా యికిరణ్, ఠాకూర్ రాజాసింగ్, వంగ అనిల్కుమార్, మానుక రాజు, మారవేణి రంజిత్, దొంతరవేణి ఎలెందర్, గుగులోత్ అనిల్, గుగులోత్ నర్సింలు, రేపాక రామచంద్రారెడ్డి, కోనేటి సాయిలు, మంచికట్ల ప్రసాద్, చిందం నరేశ్, చెర్లపల్లి సుధాకర్రెడ్డి, బాద నరేశ్, కస్తూరి కార్తిక్రెడ్డి, మిర్యాల్కార్ బాలాజీ, బానోత్ ఫీర్యానాయక్, బోడావత్ రవీందర్, గూడూరి భాస్కర్, గంట అశోక్, గడ్డమీది ప్రసాద్రెడ్డి, దాసరి గణేశ్, కోల కృష్ణపై హత్యాయత్నం కేసు నమోదైందని పేర్కొన్నారు. వారిని రిమాండ్కు తరలించనున్నట్లు చెప్పారు.
సిరిసిల్ల రూరల్, మార్చి 19 : రాజన్న సిరిసిల్లకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి గన్ లైసెన్స్ను రద్దు అయింది. ఈ మేరకు కలెక్టర్ అనురాగ్ జ యంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేటలో అతనిపై క్రైం నెంబర్ 66/2022, అండర్ సెక్షన్ లు 143, 341, 353, ఆర్/డబ్ల్యూ 34 కింద కేసులు నమోదయ్యాయి. దీంతో ఆర్మ్స్ యాక్ట్ , రూల్స్ నిబంధనల ప్రకారం ఆర్మ్స్ యాక్ట్ 1959 సెక్షన్ 17 సబ్ సెక్షన్ 3 (బీ) (డీ) ప్రకారం లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, ఉత్తర్వులను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ విజయ్కుమార్తోపాటు రెడ్డబోయిన గోపికి పంపించారు.