బెంగళూరు, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకొన్నది. పంట నష్టపోయిన రైతన్నలకు అండగా వారి రుణాలు మాఫీ చేయడం ఘోరమైన తప్పిదమన్నట్టుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైతు రుణమాఫీతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమని, రైతుల నుంచి రుణాలను ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనని తేజస్వీ సూర్య అన్నారు. సోమవారం మంగళూరులో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ గతంలో రుణమాఫీల వలన దేశానికి ఒరిగింది శూన్యమని, ఖజానా ఖర్చయ్యే జనాకర్షక పథకాల జోలికి బీజేపీ పోదని సెలవిచ్చారు.
తేజస్వీ వ్యాఖ్యలపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. వ్యవసాయం, రైతన్నల కష్టాల గురించి ఆయనకు ఏం తెలుసని రైతు నేత యశవంత ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరిస్తే రైతులు తమ రుణాల మాఫీ కోరాల్సిన అవసరం ఉండదన్నారు.