జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని, బజనులను అణచివేస్తున్నదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(టీఎస్)రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న బజనులను ఎదగనీయకుండా చేస్తున్నదని, అలాంటి పార్టీలో ఈటల చేరిండని మండిపడ్డారు.
బీసీ ముసుగేసుకున్న పెద్ద దొర ఈటలని అభివర్ణించారు. ఎమ్మార్పీఎస్(టీఎస్)జిల్లా అధ్యక్షుడు కోడెపాక సారంగం ఆధ్వర్యంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు పిట్టలవాడ దళితకాలనీలో బుధవారం ఆయన పర్యటించారు. దళితబంధు పథకంపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అన్నివర్గాలకు సమన్యాయం చేస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడని కొనియాడారు.
పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి తగిన గుణపాఠం చెబుతూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఈర్ల రమేశ్, టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి మధు, జిల్లా కార్యదర్శులు సముద్రాల రమేశ్, తాటిపెల్లి బాబు, నాయకులు రమేశ్, రాకేశ్, అంజి, రాజు, సతీశ్, కోమల, సునీత, స్వరూప పాల్గొన్నారు.