హైదరాబాద్, డిసెంబర్ 6: హైదరాబాద్లో ఇటీవల ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఆదిలోనే ఓ పెద్ద కేసును చేపట్టబోతున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీకి, ఆయన తల్లి బీనా మోదీకి మధ్య కొనసాగుతున్న ఆస్తి వివాదంలో మధ్యవర్తిత్వానికి ఐఏఎంసీ వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆస్తికి సంబంధించిన ఈ వివాదంపై లలిత్ మోదీ సింగపూర్లోని మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆశ్రయించడాన్ని సవాలు చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటవుతుందని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. ఈ సందర్భంగా లలిత్ మోదీ, బీనా మోదీ మధ్య సింగపూర్లో కాకుండా హైదరాబాద్లోని ఐఏఎంసీఏలో రాజీ కుదర్చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించడంతో.. అందుకు తాము సిద్ధమేనని లలిత్ మోదీ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే స్పష్టం చేశారు. ‘తాజాగా హైదరాబాద్లో ప్రారంభించిన ఐఏఎంసీలో లలిత్ మోదీకి, బీనా మోదీకి మధ్య రాజీ కుదిర్చే విషయాన్ని మీరు ఎందుకు పరిశీలించకూడదు?’ అని సీజేఐ రమణ ప్రశ్నించడంతో ‘డన్’ అని సాల్వే సమాధానమిచ్చారు. మరోవైపు ఈ వివాదంలో రాజీ కుదర్చుకొనేందుకు బీనా మోదీ కూడా సిద్ధమేనని, తొలుత ఈ అంశం మధ్యవర్తి ముందుకు వెళ్లాలని ఆమె తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సైతం తెలిపారు. అనంతరం ఆయన వాయిదా కోరడంతో సీజేఐ రమణ అనుమతించారు. ఈ అంశంపై తదుపరి విచారం ఈ నెల 13న జరుగనున్నది.