నీళ్లే ఆయన జీవితానికి పెద్ద మిషన్! ఇది ఆరేండ్ల క్రితం మిషన్ భగీరథ ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రశంస. మిషన్ భగీరథ అద్భుతం. దేశానికే స్ఫూర్తిదాయకం… ఇది అనేకమంది ప్రముఖుల మెచ్చుకోలు. కేసీఆర్ సార్ మన నీళ్ల కష్టాలు తీర్చిండు… ఇది ప్రతి ఒక్కరి మనసులో ఉన్న మాట. ఇవాళ 23,890 గ్రామీణ ఆవాసాల్లోని 54.06 లక్షల ఇండ్లకు నల్లా నీళ్లు అందుతున్నాయి. గోవా, హర్యానా లాంటి రెండు చిన్న రాష్ర్టాలు మినహా మరే రాష్ట్రమూ ఇప్పటికీ ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వలేకపోతున్నది.ఇవాళ తెలంగాణలోని మారుమూల గ్రామీణ ప్రజలు సైతం తాగుతున్నవి ఒట్టి మంచినీళ్లు మాత్రమే కాదు- శుద్ధి చేసిన కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలు! ఇది తెలంగాణ సాధించిన గొప్ప విజయం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనం.
బిందెడు నీళ్ల కోసం కోసుల కొద్ది ప్రయాణం.. సైకిళ్లకు వాటర్ క్యాన్లు కట్టుకొని అర్ధరాత్రి వేళ, తెల్లవారుజామున పరుగులు.. ట్యాంకర్ల వద్ద, పబ్లిక్ నల్లాల వద్ద సిగపట్లు.. ఇది గతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందటి దయనీయ గాథ. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కడా పానీపట్టు యుద్ధాలు లేవు. ప్రతి మారుమూల పల్లెలోనూ ఇంటింటికీ నల్లా కనెక్షన్లు వచ్చాయి. ఏమాత్రం మురికిలేని, కలుషితం కాని కొబ్బరి నీళ్లంత స్వచ్ఛమైన, శుద్ధమైన నీళ్లు తరలివస్తున్నాయి. ఇది మిషన్ భగీరథ పథకం మహత్యం.
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలోని 23,890 గ్రామీణ ఆవాసాల్లో మంచి నీటి కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. 54.06 లక్షల ఇండ్లను శుద్ధిచేసిన నదీ జలాలు పునీతం చేస్తున్నాయి. ఇందుకు అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం వెచ్చించిన మొత్తం అక్షరాల రూ. 36 వేల కోట్లు. గ్రామీణ ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేందుకు, మహిళల కష్టాలు పారదోలేందుకు ఇంత పెద్ద మొత్తంలో వ్యయం చేసిన ఏకైక, తొలి రాష్ట్రం తెలంగాణ.
కేవలం ఇండ్లకే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సైతం నల్లా కనెక్షన్లు ఇచ్చి, శుద్ధి చేసిన నదీ జలాలను సరఫరా చేస్తున్న ఘనత కూడా తెలంగాణదే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సాగించిన కృషిని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న రాష్ర్టానికి రూ.19,2 05 కోట్లు ఇవ్వండని కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హడ్కో రెండు సార్లు 2016, 2017లో అవార్డులు అందజేసింది. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా లభించింది. కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ పథకం సాధించిన విజయాలను అనేకసార్లు కొనియాడారు.
అన్ని రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఉద్బోధించారు.ఏకంగా 13 రాష్ర్టాల అధికారులు, ప్రజాప్రతినిధులు మన రాష్ర్టానికి వచ్చి, క్షేత్రస్థాయిలో మిషన్ భగీరథ పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా సాయం పొందకుండానే తెలంగాణ ప్రభుత్వం సాధించిన అద్భుత విజయమిది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కొక్కరికి సగటున వంద లీటర్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 68 టీఎంసీల నదీ జలాలను శుద్ధి చేసి సరఫరా చేస్తుండటం విశేషం. ప్రతి ఇంటికి సురక్షితమైన నీళ్లు సరఫరా అవుతుండటంతో రాష్ట్రంలో వాంతులు, విరోచనాలు లాంటి నీటి ద్వారా వ్యాపిం చే వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ఇంత చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ప్రజల మీద నయా పైసా భారం మోపడం లేదు. అదీ ప్రజల దాహార్తిని తీర్చడంలో సీఎం కేసీఆర్కు ఉన్న కమిట్మెంట్!
మిషన్ భగీరథను కేంద్రం ప్రభుత్వం అనేకసార్లు ప్రశంసించింది. తెలంగాణ అనుసరిస్తున్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర జల్శక్తి శాఖ రాష్ర్టాలకు లేఖ రాసింది. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఎప్పుడు సమీక్ష నిర్వహించినా, ఏ రాష్ర్టానికి వెళ్లినా తెలంగాణను ప్రశంసిస్తున్నారు. పార్లమెంటులో సైతం ఈ పథకం సాధించిన విజయాలను వివరించారు. ఇతర రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని సూచిస్తున్నారు.
మిషన్ భగీరథ అమలవుతున్న తీరును 13 రాష్ర్టాలకు చెందిన మంత్రులు, అధికారులు స్వయంగా చూసి వెళ్లారు. కొన్ని రాష్ర్టాలు తాము కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించాయి. కొన్ని రాష్ర్టాల్లో రాజకీయ పార్టీలు మిషన్ భగీరథ తరహాలో ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తామంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ర్టాల అధికారులు ఈ ప్రాజెక్టును పరిశీలించారు.
నీతి ఆయోగ్ సంస్థ 2016లో తెలంగాణలో జరుగుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను క్షుణ్ణంగా పరిశీలించింది. నీటి సంరక్షణ, ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పథకాలు చేపట్టిందని ప్రశంసించింది. మిషన్ భగీరథ లక్ష్యం, పనులు జరగుతున్న తీరు, ప్రణాళిక, నదీ జలాలను శుద్ధి చేసి, ఇంటింటికి తాగునీటిని అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని చూసి అబ్బురపడింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి రూ.19,205 కోట్లు ఇవ్వాలంటూ సిఫారసు చేసింది. దీనిని గుర్తు చేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్.. అనేక మార్లు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులకు, అధికారులకు లేఖలు రాశారు. వినతిపత్రం సమర్పించారు. అయినా కేంద్రం స్పందించలేదు. ఇప్పటివరకు నయా పైసా ఇవ్వలేదు.
నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించేది. చిన్న వయస్సులో నడుం వంకర పోవడం, బొక్కలు విరగడం, కాళ్లు వంకర్లు తిరగడం, వయస్సు పెరిగినా ఎత్తు పెరగకపోడం లాంటివి వెంటాడాయి. ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు ఏనాడో చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారంగానే స్వరాష్ట్రంలో కేసీఆర్ మిషన్ భగీరథకు రూపకల్పన చేశారు. ఫ్లోరైడ్ సమస్యపై యుద్ధానికి, మిషన్ భగీరథను అమలుచేస్తున్న విషయానికి గుర్తుగా చౌటుప్పల్ వద్ద మిషన్ భగీరథ పైలాన్ను ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలం వల్లనే మిషన్ భగీరథ సాధ్యమైంది. కేసీఆర్ నీటి సౌకర్యాల కల్పనను ఒక మిషన్గా మార్చుకున్నారు. నన్ను కలిసిన ప్రతిసారీ తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడేవారు. ప్రత్యేకంగా నీళ్ల గురించి మాట్లాడితే.. ఆయన ఎంతో ఉద్వేగానికి గురయ్యేవారు. నీళ్లే ఆయన జీవితానికి పెద్ద మిషన్లా మారాయి.
– 2016 ఆగస్టు 7న కోమటిబండ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ
మిషన్ భగీరథ దేశానికే స్ఫూర్తిదాయకం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభినందిస్తున్నా. తెలంగాణలోని 54 లక్షల కుటుంబాలకు నల్లా నీటిని అందిస్తున్నారు. తెలంగాణలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన రాష్ర్టాలు కూడా ఇదేవిధంగా ఇంటింటికీ నీటిని అందించాలి.
– గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి
మంచినీటి కష్టాలను తీర్చడానికి సీఎం కేసీఆర్ ముందుచూపుతో మిషన్ భగీరథను చేపట్టారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే మహిళలు ఎంతో కష్టపడేవారు. ఇప్పుడు నీటి కష్టాలు లేవు. కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథకు అనేక అవార్డులు ఇచ్చింది. కానీ, ఒక్క పైసా ఇవ్వలేదు. గుజరాత్లో ప్రారంభమైన పథకానికి కూడా నిధులు ఇచ్చింది. కొన్ని రాష్ర్టాల్లో ప్రారంభంకాని వాటికి కూడా పైసలు ఇచ్చింది. నీతి ఆయోగ్ చెప్పినా తెలంగాణకు మాత్రం పైసా ఇవ్వలేదు.
– ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయి. ప్రతి గ్రామానికి నీళ్లు అందుతున్నాయా? ఎన్ని నీళ్లు సరఫరా చేశారు? అనే అంశాలను వేకువజాము నుంచే పర్యవేక్షిస్తున్నాం. ఇందు కు ఆన్లైన్ వ్యవస్థను అమలు చేస్తున్నాం. గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారని సర్పంచ్, గ్రామ కార్యదర్శి, వాటర్మెన్ నుంచి అధికారులు సంతకాలు తీసుకుంటారు. ఒకవేళ నీరు సరఫరా చేయలేకపోతే వాళ్లు సంతకాలు పెట్టరు. దీని ద్వారా ఆరోపణలకు, అపోహలకు ఆస్కారం ఉండదు. మిషన్ భగీరథ నీటిని తాగడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అనుమానాలు, అపోహలు ఉంటే శాస్త్రీయంగా నివృత్తి చేస్తున్నాం.
– కృపాకర్రెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ