రవీంద్రభారతి, మే4: ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీసీ(ఏ) జాబితాలోని 57 కులాలకు చెందిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని తెలంగాణ రజక సంఘం, బీసీ(ఏ) జాబితాలోని 57 కులాల నేతలు పిలుపునిచ్చారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శనివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. నారాయణపేట, సిద్దిపేట ఎన్నికల సభ ల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీ(డీ) జాబితాలో ఉన్న ముదిరాజ్లను బీసీ (ఏ) జాబితాలో కలుపుతామని ప్రకటించడం ఆక్షేపణీయమని పేర్కొన్నా రు.
ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ సీఎం దీనిపై హామీ ఇవ్వడం ఎన్నికల నియమావళిని ధిక్కరించడమే అవుతుందని, తక్షణమే ఎన్నికల కమిషన్ ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బీసీ(ఏ) జాబితా కులాలకు క్షమపణ చెప్పాలని, లేకుంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ(ఏ) కులాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ నరహరి, ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులు, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసల సంపత్, ప్రొఫెసర్ బాగయ్య, చాకలి ఐలమ్మ శ్వేత లు, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడప నరహరి, తెలంగాణ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజ న్న, రజక వ్యాపార సంఘం రాష్ట్ర కన్వీనర్ పీ నర్సింహ, రాములు పాల్గొన్నారు.