Telangana | హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను చేరుకోవాలంటే అధికారులతోపాటు సిబ్బంది నిబద్దతతో పని చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇ. శ్రీధర్ అన్నారు. తెలంగాణ అబ్కారీ భవన్లో శుక్రవారం తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమీక్షా సమావేశం జరిగింది.
తెలంగాణలో మళ్లీ నాటుసారా తయారీ చేస్తున్నట్లు అధికారుల దాడుల్లో తేలిందన్నారు. రాష్ట్రంలోని 26 ఎక్సైజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో నాటుసారా తయారీ చేస్తున్నట్లు బయటపడిందన్నారు. ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కలిసి మూడు నెలల్లో నాటుసారా ఆనవాళ్లు కనిపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాటుసార తయారీ విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉందన్నారు.
నాటుసారాతో పాటు ఎన్నికల సందర్భంగా చాల ప్రాంతాల్లో నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ వస్తున్నట్లుగా తేలిందన్నారు. నాన్డ్యూటి పెయిడ్ లిక్కర్ను తెలంగాణలోకి రాకుండా ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేకమైన నిఘా పెట్టి దాడులు నిర్వహించాలన్నారు. ప్రధానంగా వేసవిలో బీర్లు స్టాక్ లేదనే వార్తలు వస్తున్నాయని, రికార్డుల పక్రారం పరిశీలిస్తే గత సంవత్సరం కంటే ఎక్కువ బీరు నిల్వలు ఉన్నట్లు తేలిందన్నారు. మద్యం దుకాణాల్లో బీర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అదేశించారు.
నాటుసారా తయారీకి వినియోగించే ముడి సరుకుల రవాణపై ప్రత్యేక నిఘా పెంచి, దాడులు నిర్వహించి నాటుసారా తయారీని తుదముట్టించాలని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి ఆదేశించారు. ఆగస్టు నాటికి పూర్తిగా నిర్మూలించడానికి ప్రణాళికలు రూపొందించుకొని కార్యాచరణ చేపట్టాలని అదేశించారు. నాన్డ్యూటీ పెయిడ్ మద్యాన్ని రవాణా కాకుండా చర్యలు చేపట్టాలని, కల్తీ కల్లు తయారీకి వినియోగించే సిహెచ్, డైజోఫాం, ఆల్ఫాజోలమ్ లాంటి పదార్థాలను అరికట్టాలన్నారు. గంజాయి, నార్కోటిక్, ఇతర మత్తు మందుల తయారీ, దిగుమతి, అమ్మకాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. అవసరమైతే తెలంగాణలోని పలు జిల్ల్లాల్లో పోలీసుల సహకారం తీసుకొని నాటుసారా తయారీపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు.