హైదరాబాద్, జనవరి 27 : కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు ఏ మాత్రం అన్యాయం చేసినా పార్లమెంటును ముట్టడిస్తామని గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో కనీసం ఐదు శాతం కూడా కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గతేడాది బీసీల సంక్షేమానికి కేవలం రూ.1,050 కోట్లు కేటాయించారని, ఒక్కొక్క రాష్ర్టానికి రూ.35 కోట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు. ఈ నిధులతో దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీ జనాభాకు బిస్కెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. తగిన రీతిలో నిధులను కేటాయించకుండా, బీసీ జనాభా లెక్కలు తీయకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. జీఎస్టీ వసూలు ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని, బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.