పూల సింగడి నేలకు దిగిందా అన్నట్టుగా గ్రేటర్ అంతా తీరొక్క పువ్వులతో మురిసిపోతున్నది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలను నగరవాసులు వైభవంగా జరుపుకొంటున్నారు. నాలుగో రోజు బుధవారం యువతులు, మహిళలు, పిల్లలు పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడి.. భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలిచారు. అసెంబ్లీలో ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, బల్దియా ప్రధానకార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ సామల హేమ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కోర్టులు, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): ప్రకృతి పూల పండుగ.. పుడమి నిండుగా పరుచుకుని నగరంలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. బుధవారం నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ వేడుకలను జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయంతో పాటు రవీంద్రభారతి, తెలంగాణ సాంస్కృతిక సారథి, రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణాలలో వైభవంగా జరిగింది. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఆడపడుచులు ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..’ అంటూ ఆడి పాడారు. కోలాటలు, లయబద్ధమైన చప్పట్లకు తోడుగా బతుకమ్మ ఆటలు చూపరులను ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రాంగణంలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరై న్యాయవాదులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బార్ అసోసియేషన్ కార్యదర్శి పొన్నం దేవరాజు గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, పీపీ కొంగర రాజిరెడ్డి, జీపీ రాజేశ్వర్రావు, బీసీ కమిషన్ సభ్యులు ఉపేందర్, ఫుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్రెడ్డి, జాగృతి లీగల్ సెల్ కన్వీనర్, కోకన్వీనర్ తిరుపతివర్మ, వొద్యారపు రవికుమార్, పీపీలు జ్యోతిరెడ్డి, బర్ల సునీత, భువనేశ్వరి, స్వప్న, అంజలి, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
కూరగాయలతో బతుకమ్మ
జల్పల్లి మున్సిపాలిటీ పరిధి శ్రీరామకాలనీ అంగన్వాడీ స్కూల్లో పోషణ మాసం సందర్భంగా కూరగాయలతో బతుకమ్మని చేసి సంబురాలు నిర్వహించారు. బాలాపూర్ సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ అనితారెడ్డి విచ్చేసి పోషకాహారంపై తల్లులకు ఆవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ సెక్టార్ పరిధిలోని 33 మంది అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
– పహాడీషరీఫ్, సెప్టెంబర్ 28
టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో..
మింట్ కాంపౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు సీఎండీ రఘుమారెడ్డి హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. డైరెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, మదన్మోహన్రావు, నరసింహారావు, స్వామిరెడ్డి, మహిళా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తులసినాగరాణి, జ్యోతిరాణి, మంగమ్మ, సత్తెమ్మ, ఇంజినీర్ అసోసియేషన్ నాయకులు రత్నాకర్రావు, బీసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఎస్టీడీసీ కార్యాలయంలో..
హిమాయత్నగర్లోని తెలంగాణ రాష్ర్ట పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతున్న సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎండీ మనోహర్, హరిత హోటల్స్ జీఎంలు నాథన్, సత్యనారాయణ, శాంతి, నర్సింహారావు, రవీందర్నాయక్, అంజిరెడ్డి, పట్టాభి, లక్ష్మణ్రావు, ఓంప్రకాశ్ తదితరులు
బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడిన మేయర్, డిప్యూటీ మేయర్
సిటీబ్యూరో, సెప్టెంబరు 28 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డితో పాటు యూసీడీ విభాగం అదనపు కమిషనర్ శృతి ఓజా, అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్లు మమత, పంకజ, గాజుల రామారం డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, మహిళా అధికారులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు.
రేపు పీపుల్స్ ప్లాజాలో..
ఈనెల 30వ తేదీన జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ ఉత్సవాల్లో మహిళా మంత్రులు, ఎమ్మెల్సీ కవిత, మహిళా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మను పురసరించుకొని ఎల్బీ స్టేడి యం నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు మేయర్ తెలిపారు.