ఉస్మానియా యూనివర్సిటీ, మే 9: అభివృద్ధిలో సికింద్రాబాద్(Secunderabad) అసెంబ్లీ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపామని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్(Padmarao Goud) అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) కారు గుర్తుకే ఓటు వేసి తనను ఎంపీగా గెలపించాలని కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తార్నాక డివిజన్ మాణికేశ్వరీనగర్లో గురువారం విస్తృతంగా పర్యటించారు.
ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అయిదు మంది ఎమ్మెల్యేలు ఉన్నామని, పట్టుబట్టి కష్టపడి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామని అన్నారు. ఈ ఐదేళ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కిషన్రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని అన్నారు. ఒకరేమో పార్టీలు మారతారని, మరొకరేమో దేవుళ్ల పేరు చెప్పి రాజకీయాలు చేస్తారని విమర్శించారు. తాము ఏమి చేశామో ఎవరూ చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రజలకు అవగాహన వచ్చిందని తెలిపారు.
ఐదేళ్లకు కేంద్రం నుంచి ఎంపీ లాడ్స్ నిధులు రూ.25 కోట్లు వస్తాయని, అవి ఖర్చు పెట్టకపోతే వెనక్కి పోతాయని చెప్పారు. కిషన్రెడ్డి అదే చేశారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దానం నాగేందర్ వెళ్తాడని దుయ్యబట్టారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మెజారిటీ వస్తుందని ఉద్ఘాటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఓటరును అడిగినా ఓటు కారు గుర్తుకే అంటున్నారని, తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మేడే రాజీవ్సాగర్, బీఆర్ఎస్ యువజన విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆలకుంట హరి, యువనేత త్రినేత్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.