Harish Rao | బీజేపీతో పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకే లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశంలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. మైనార్టీల పిల్లల చదువుల కోసం రెసిడెన్షియల్ సూళ్లను 204 పెంచిన ఘనత కేసీఆర్దే అన్నారు.
బీజేపీతో పోరాట ఫలితంగానే కేసీఆర్ కుమార్తె కవిత జైలుకు వెళ్లాల్సి వచ్చిందని హరీశ్రావు అన్నారు. బీజేపీతో తాము కలిసి ఉంటే కవిత అరెస్టు అయ్యేవారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీతో మిలాఖత్ అయి బీఆర్ఎస్ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిగానే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవరూ మీకు అందుబాటులో ఉండరని అన్నారు. మళ్లీ ప్రజలకు అందుబాటులో ఉండేది బీఆర్ఎస్ పార్టీ నాయకులే అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయినా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయట్లేదని హరీశ్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే కేసీఆర్ కిట్టు పోయిందని, షాదీ ముబారక్ బంద్ అయ్యిందని, తులం బంగారం జాడ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా రివర్స్ గేర్లో నడుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు మాటలు చెప్పడం తప్ప, మైనార్టీలకు రూపాయి ఇవ్వలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.