సౌత్ ఆఫ్రికా : తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ వేడుకలను సౌతాఫ్రికాలోని జోహానెస్ బర్గ్ (sandton) లో ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా’ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు.
బతుకమ్మ పాటలతో పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల, కోలాట పాటలు పాడారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలన్నీ నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. రహదారులన్నీ కోలాహలంగా మారాయి.
రంగురంగు పూల బతుకమ్మలతో ఆడపడుచుల ఆట,పాటలు..సంప్రదాయ నృత్యాలతో హోరెత్తాయి. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఆడిపాడి సందడి చేశారు. మగవారు సైతం బతుకమ్మలతో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. TASA కరోనా సమయంలో ప్రపంచంలో నే మొట్టమొదటి సారిగా ఆన్లైన్లో బతుకమ్మ పండగలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
కార్యక్రమంలో టాసా అధ్యక్షుడు యెలిగేటి వేణుమాధవ్, వైస్ చైర్మన్ తాళ్లూరి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ బండారు మురళి, కోశాధికారి బొబ్బాల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాపోలు సీతారామరాజు పాల్గొన్నారు.