ఖైరతాబాద్, డిసెంబర్ 27: ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చారో స్పష్టం చేయాలి.. ఇక్కడ కాదు.. ఢిల్లీలో దీక్ష చేపట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రకటించారని, ఏడేండ్లు గడుస్తున్నాయని, ఇప్పటి వరకు 14కోట్ల ఉద్యోగాలు రావాలని, ఎన్ని ఉద్యోగాలిచ్చారో సమాధానం చెప్పాలన్నారు. బండి సంజయ్ కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఇక్కడ దీక్షలు చేపట్టడం సిగ్గు చేటన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇచ్చారో ఆ పార్టీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్చుగ్ చెప్పాలన్నారు.
బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు ఏ మేరకు అమలు చేశారో బండి బదులు చెప్పాలన్నారు. దేశంలోనే అతి పెద్ద సంస్థ అయిన రైల్వేను ప్రైవేట్ పరం చేశారన్నారు. వాస్తవానికి రైల్వేశాఖలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ మంది ఉన్నారని, పైగా అందులో రిక్రూట్మెంట్ నిలిపివేశారన్నారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని కుట్రలు, కుతంత్రాలు చేసి పలు సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభు త్వం ఇప్పటికే అనే శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసిందని, దళిత, రైతు బంధు లాంటి పథకాలు తీసుకువచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నదన్నారు. బండి ఎన్ని కు యుక్తులు పన్నినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని కోరాలన్నారు. బీజేపీ చేస్తున్న ఈ చర్యలను ప్రజలకు బహిర్గతం చేస్తామన్నారు. కేంద్రం హామీలో చెప్పిన విధంగా ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 8న ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పేట భాస్కర్, బొంకూరు నరేందర్, రాష్ట్ర ప్లానింగ్ కమిటీ అధ్యక్షుడు కే. శ్రీనివాస్, టూవీలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు, టీఏవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. చంద్రమౌళి, తాండూరి దేవయ్య, ఎస్కే సుల్తాన్, కల్వల ఆనంద్ పాల్గొన్నారు.