కరీంనగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నాటితో ముగిసింది. ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఈ నెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా 53 మంది 94 నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నెల 29 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇచ్చారు. అప్పటికిగాని బరిలో ఎవరెవరు ఉంటారనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియ ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రారంభమైంది. కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల అధికారి పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రెండు రోజులు కాస్త మందకొడిగా సాగిన నామినేషన్ల ప్రక్రియ ఆ తర్వాత పుంజుకుంది. ఒక్కో అభ్యర్థి రెండు అంతకు మించి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్కుమార్ ఈ నెల 20న అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు.
22న కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయగా మంత్రి పొన్నం ప్రభాకర్తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక చివరి రోజైన గురువారం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఇతర పార్టీల అభ్యర్థులు కూడా తమ మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. పార్లమెంట్ స్థానానికి మొత్తం 52 మంది 94 నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను శుక్రవారం అధికారులు పరిశీలించనున్నారు. 29 వరకు ఉప సంహరణకు గడువు ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఎంత మంది ఉప సంహరించుకుంటారు, ఎంత మంది బరిలో నిలుస్తారనేది 29న తేలనుంది.
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే పలు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే ఆయన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధం చేస్తూ వచ్చారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలోనే ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమరపాటుతో ఉన్న కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలనే సంకల్పంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు. కేటీఆర్, హరీశ్రావు లాంటి అగ్ర నేతలు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా ప్రచారం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్లో టికెట్ విషయమై ఆలస్యం కావడం, చివరి క్షణాల్లో ఆ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును ప్రకటించారు. పార్టీ ప్రచారం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. మొత్తానికి రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఏడు అసెంబ్లీ స్థానాలు, 42 మండలాల పరిధిలో ఉన్న కరీంనగర్ పార్లమెంట్లో 17,89,353 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 8,74,884 మంది పురుషులుకాగా 9,14,367 మంది మహిళలు, 102 మంది ట్రాన్స్జెండర్లు. వీరిలో 174 మంది ఓవర్సిస్ ఓటర్లు, 961 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. కాగా, దివ్యాంగ ఓటర్లు 41,718 మంది ఉండగా, 85 సంవత్సరాలు దాటిన వారు 13,780 మంది ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో 2,194 పోలింగ్ బూత్లు ఉండగా 1,484 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. 288 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది.
కలెక్టరేట్, ఏప్రిల్ 25 : పార్లమెంటు ఎన్నికల నామినేషన్లలో భాగంగా చివరి రోజైన గురువారం 27 మంది అభ్యర్థులు, 32 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 12 మంది స్వతంత్ర అభ్యర్థులుగా, నలుగురు వివిధ రాజకీయ పార్టీల పేరిట రిటర్నింగ్ అధికారికి తమ పత్రాలు అందజేశారు. మొత్తం 53 మంది అభ్యర్థులు 94 నామినేషన్లు వేయగా, తుదిరోజైన గురువారం పొడిశెట్టి భూమయ్య బహుజన ముక్తి పార్టీ, కడుతాల అనిల్రెడ్డి నవక్రాంతి పార్టీ, మాతంగి హన్మయ్య దళిత బహుజన పార్టీ, మీసాల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు.
స్వతంత్ర అభ్యర్థులుగా ఆరెల్లి సుమలత, జహీదా బేగం, ఎస్.నిరంజన్, మహ్మద్ సుక్రద్దిన్, మాంకాలి తిరుపతి, పచ్చిమట్ల రవీందర్, కరికె సుభాష్, డేగల వెంకటనర్సయ్య, దుగ్యాల శ్రీలత, పళ్లెల దేవరాజు, కళ్లెం హన్మంతరెడ్డి, గుజ్జుల శ్రీనివాస్రెడ్డి, ఆకునూరి రాజు తమ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ తరఫున ఆరె రవిగౌడ్ నాలుగో సెట్టు, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ మూడో సెట్టు, ఎంసీపీఐ, డీఎస్పీ అభ్యర్థులు లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, చిలువేరు శ్రీకాంత్లు రెండో సెట్టు, స్వతంత్ర అభ్యర్థులు గౌరిశెట్టి సురేశ్, పేరాల మానస, కట్కూరి ఏనోస్ రెండో సెట్టు నామినేషన్ పత్రాలు ఆర్వోకు సమర్పించారు.