న్యూఢిల్లీ: స్కూల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సౌకర్యం (Air Conditioning Facility) ఖర్చులను విద్యార్థుల తల్లిదండ్రులు భరించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. దీని కోసం ప్రైవేట్ స్కూల్ అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నదని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కోర్టు తిరస్కరించింది. ఒక ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి క్లాస్లో ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం కోసం నెలకు రూ.2000 వసూలు చేస్తున్నారు. ఆ విద్యార్థి తండ్రి దీనిపై హైకోర్టును ఆశ్రయించాడు. విద్యార్థులకు ఏసీ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యంపై ఉందని, వారి సొంత నిధుల నుంచి ఈ సౌకర్యం కల్పించాలంటూ పిల్ దాఖలు చేశాడు.
కాగా, ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్పై విచారణ జరిపింది. విద్యార్థులకు తరగతి గదుల్లో ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం కల్పించడం వంటి
ఆర్థిక భారాన్ని కేవలం స్కూల్ యాజమాన్యమే భరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ల్యాబ్ వంటి ఇతర ఛార్జీలతో ఇది సమానమని, తల్లిదండ్రులే చెల్లించాలని తేల్చి చెప్పింది. స్కూల్ను ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, ఇతర ఖర్చుల గురించి పేరెంట్స్ ముందస్తుగా తెలుసుకోవాలని సూచిస్తూ ఆ పిల్ను కొట్టివేసింది.