రైతులకు మంత్రి నిరంజన్రెడ్డి పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో వెదురు సాగును పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం వెదురు సాగుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో వెదురుకు భారీ డిమాండ్ ఉన్నదని, విద్యుత్తు ఉత్పత్తిలో బొగ్గుకు బదులుగా వెదురును విరివిగా ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ థర్మల్ విద్యుత్తు కేంద్రంలో 5 శాతం వెదురును వినియోగించాలని కేంద్రం ఆదేశించిందని గుర్తు చేశారు. ప్రతి రెండేండ్లకు పంట కోతకు వస్తుందని, 50 ఏండ్ల వరకు దిగుబడి ఉంటుందని వెల్లడించారు. 2 లక్షల ఎకరాల్లో వెదురు సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. లాభదాయకమైన వెదురు సాగుపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. సమీక్షలో ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అటవీ ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, వెదురు శాస్త్రవేత్త నంబీ భారతి తదితరులు పాల్గొన్నారు.