హనుమకొండ చౌరస్తా, మార్చి 25: రాష్ర్ట విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ విద్య కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చేసిన సూచనల్లో కొన్నింటిని సవరించాలని పి.డి.ఎస్.యు. రాష్ర్ట ఉపాధ్యక్షుడు బి. నరసింహరావు డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ ఎస్.డి.ఎల్.సి.ఇ.లోగల సైకాలజీ విభాగంలో భారత జాతీయోద్యమ వీరులు షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్ దేవ్ల 95వ వర్ధంతి స్మారక వారోత్సవాల (మార్చి 23 నుండి 30 వరకు) సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నిజమైన స్వాతంత్రం కోసం, కుల మత ఆర్థిక అసమానతలు లేని సంపూర్ణ సమాజం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల పోరాట స్ఫూర్తితో నేటి విద్యార్థి, యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ర్టంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగం పట్ల నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నారని, విద్యారంగానికి బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ర్ట విద్యా కమిషన్ చేసిన సూచనలు కొన్ని విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి అడ్డంకిగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. వరంగల్- హన్మకొండ జిల్లా అధ్యక్షులు బోయినపల్లి అజయ్, రాష్ర్ట గర్ల్స్ కో- కన్వీనర్ పి.అనూష, రాష్ర్ట నాయకులు దండు వినయ్, కె.యు. నాయకులు లోకేష్, ప్రవర్ధన్, శివకుమార్, దేవా, పూజిత, రమ్య, తేజస్విని, ప్రతాప్, ధర్మ, సోనీ, అమూల్య, మాళవిక పాల్గొన్నారు.