యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభసంప్రోక్షణ ఘట్టాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. మూడోరోజైన బుధవారం ప్రధానాలయ ముఖ మండపంలోని ఉపాలయాల్లో పునఃప్రతిష్ఠించనున్న ఆండాళ్ అమ్మవారు, ఆళ్వారు విగ్రహాలు, గరుత్మంతుడికి దివ్యవిమానగోపుర సుదర్శన చక్రానికి ప్రధానార్చక బృందం షోడశ కలశాభిషేకం నిర్వహించింది. అనంతరం నిత్యలఘు పూర్ణాహుతి, లక్ష్మీనృసింహ మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలు జరిగాయి. పంచకుండాత్మక మహాయాగంలో భాగంగా బాలాలయంలోని యాగశాలలో శాంతి పాఠం, ద్వారతోరణ ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, విష్ణుసహస్రనామ పారాయణం పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో కొనసాగాయి.
యాదాద్రి, మార్చి 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ ప్రధాన ఘట్టాలు కొనసాగుతున్నాయి. ప్రధానాలయ ముఖ మండపంలోని ఉపాలయాల్లో పునఃప్రతిష్ఠించనున్న అండాళ్ అమ్మవారు, ఆళ్వారు విగ్రహాలు, దివ్యవిమానగోపురంపై పునఃప్రతిష్ఠించే సుదర్శనచక్రానికి ప్రధానార్చక బృందం షోడశ కలశాభిషేకం నిర్వహించింది. సర్వదోష నివారణకు షోడశ గుణానుభవంతో గోమూత్రం, పంచామృతాలతో అభిమంత్రించారు. అనంతరం ప్రధానాలయంలో నిత్య లఘు పూర్ణాహుతి, 108 మంది రుత్వికులతో లక్ష్మీనృసింహ మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలు జరిగాయి. సాయంత్రం మూలమంత్ర హవనం, పంచగవ్యాదివాసం, నిత్య లఘు పూర్ణాహుతిని చేపట్టారు. పంచకుండాత్మక మహాయాగంలో భాగంగా బాలాలయంలోని యాగశాలలో శాంతి పాఠం, ద్వార తోరణ, ధ్వజ కుంభారాధనలు, చతుఃస్థానార్చన నిర్వహించారు. సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం, యాగశాలలో ద్వారతోరణ, ధ్వజ కుంభ ఆరాధనలు, నిత్య లఘు పూర్ణాహుతి కైంకర్యాలు పాంచరాత్ర ఆగమశాస్త్రరీతిలో కొనసాగాయి.
ప్రధానాలయంతో పాటు బాలాలయంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు కొనసాగుతున్నాయి. బాలాలయంలో నిత్యారాధనల అనంతరం స్వామి వారి సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు పంచకుండాత్మక మహాయాగాన్ని యాజ్ఞీకులు, అర్చకులు, రుత్వికులు చేపట్టారు. మొదటగా శాంతి పాఠం చేపట్టారు. ఇందులో భాగంగా అర్చకులు, పారాయణీకులు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, చతుర్వేద, పురాణ, ఇతిహాస, శ్రీభాష్య, భగవద్విషయం, యాదాద్రి క్షేత్ర మహత్మ్యం, నృసింహతాశిన్యుపనిషత్, నృసింహ మూలమంత్ర, దివ్యప్రబంధాలను పఠించారు. చతుః స్థానార్చనలు, ద్వార తోరణ, ధ్వజ కుంభారాధనలు చేపట్టారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేద మంత్రాలతో ప్రాణశక్తి హోమాలు విలక్షణంగా జరిపారు.
ప్రధానాలయ ముఖ మండపంలోని ఉపాలయాల్లో పునః ప్రతిష్ఠామూర్తులకు ప్రధానార్చక బృందం షోడశ కలశాభిషేకం పాంచరాత్రాగమశాస్త్రంగా నిర్వహించింది. సర్వదోష నివారణకు షోడశ గుణానుభవంతో గోమూత్రం, పంచామృతాలతో అభిమంత్రించారు. బింబ అంతర్గమైన సర్వదోష నివారణకు షోడశ గుణానుభవంతో షోడశ కలశాలతో పాటు వనస్పతి దేవతలకు సంబంధించిన ఓషధి, శుద్ధోదకాలు, పంచామృతాలలో అభిషేకం జరిపారు. కలశ అంతర్గమైన ఆయా దేవతలను, ఆయా మంత్రాలతో ఆవాహన గావించి సంప్రోక్షణతో వేడుకను నిర్వహించారు. శుద్ధ జలాలు, వనస్పతి ఔషధాలతో కూడిన ద్రవ్యవిశేషాలు, పంచామృతాలతో ఆవాహన గావించి సంప్రోక్షణ చేపడితే అత్యంత పవిత్రత చేకూరుతుందని, తద్వారా బింబమూర్తి స్వరూపాలన్నీ తేజోమంతులై లోకానికి భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. మంత్రం పరమాత్మ స్వరూపమని, మంత్రాధీనమైన దైవాన్ని ఆయా మంత్రాలతో ఆహ్వానించుట విశ్వశాంతి, లోకకల్యాణ కారణమని అన్నారు. షోడశోపచారం నిర్వహించు విధానం ఈ వేడుక ద్వారా తెలియజేస్తుందన్నారు. మహాకుంభ సంప్రోక్షణలో ఈ ఉత్సవాలు భగవంతుడికి అత్యంంత ప్రీతికరమని తెలిపారు.
లక్ష్మీనృసింహ మూల మంత్ర,
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ప్రధానాలయంలో మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు కొనసాగుతున్నాయి. 2వ రోజు లక్ష్మీనృసింహ మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలను 108 మంది రుత్వికులు పఠించారు. వీటితో పాటు దివ్య ప్రబంధ పారాయణం, మహాభారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత, నారాయణ దివ్ర ప్రబంధ పారాయణాలు పఠించారు. ఈ మహాక్రతువు పూర్తయ్యే వరకు ప్రధానాలయంలో కోటి లక్ష్మీనృసింహ మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలను నిర్వహిస్తామని ప్రధానార్చకులు తెలిపారు.
బాలాలయంలో నిత్యారాధనల అనంతరం మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు కొనసాగించారు. సాయంత్రం 6 గంటలకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణాలు, ద్వార తోరణ ధ్వజ కుంభారాధనలు జరిపి, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనం, లఘు పూర్ణాహుతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మరిగంటి మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, శ్రీధరాచార్యులు, ఆలయ అధికారులు దోర్బల భాస్కర్ శర్మ, గట్టు శ్రవణ్కుమార్, గజవెల్లి రమేశ్బాబు పాల్గొన్నారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో కొనసాగుతున్న మహాకుంభ సంప్రోక్షణ పూజల్లో బుధవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. పంచకుండాత్మక మహాయాగంలో పాల్గొని తరించారు. మొదటగా సువర్ణమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణలో సొంత ఖర్చులతో ప్రధానాలయంతోపాటు ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ చేపడుతున్నట్లు దానం తెలిపారు.
ఉదయం శాంతి పాఠంతో ప్రారంభం, చతుస్థానార్చన, మూలమంత్ర హవనాలు, పంచవింశతి కలశ స్నపనం, నిత్య లఘు పూర్ణాహుతి. సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, యాగశాలలో మూలమంత్రహవనం, చతుస్థానార్చన, జలాధివాసం, నిత్యలఘు పూర్ణాహుతి ఉంటాయి.
ప్రధానాలయంలో సాయంత్రం 6 గంటలకు పంచగవ్యాదివాసం అర్చకులు అత్యంత వైభవంగా చేపట్టారు. పునఃప్రతిష్టించే విగ్రహాలకు నెయ్యి, పెరుగు, తేనె, పంచదారతో అభిషేకం, అదివాస మంత్రాలతో ఆవాహనం చేశారు. అనంతరం బింబ సంప్రోక్షణ తంతు నిర్వహించారు.