యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వరకు 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్దాంతానుసారముగా, భగవద్రామానుజ సాంప్రదాయ సిద్దముగా బ్రహ్మోత్సవములు నిర్వహించుటకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.
స్వామి బాలాలయం నందు 4వ తేదీన ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనము, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14న ఉదయం 10 గంటలకు శ్రీ స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
మార్చి 11న ఉదయం 11 గంటలకు బాలాలయములో నిర్వహించే శ్రీ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు, టీటీడీ తరపున, పోచంపల్లి చేనేత సంఘం తరపున శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ వేడుకలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది.