నిర్మల్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో గురువారం టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ తగిలింది. మండల కేంద్రంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ పనులను కొనసాగించకుండా చర్యలు తీసుకుంటామంటూ గ్రామస్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతలోనే పలువురు ముందుకు వచ్చి తాము ఇప్పుడు గుర్తుకు వచ్చామా? అంటూ నిలదీశారు. అక్రమ కేసులు నమోదు చేసినప్పుడు తమకు ఎవరూ అండగా నిలువలేదని, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని తమ వద్దకు మళ్లీ వచ్చారా? అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, కేవలం ఇథనాల్ పరిశ్రమను అడ్డుకునేందుకు జరుగుతున్న పోరాటంలో సంఘీభావం తెలిపేందుకే వచ్చానని చెప్పుకొచ్చారు. ఇక్కడి రైతులపై పెట్టిన కేసులను ఎత్తేసే వరకు టీజేఏసీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.