నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్) పునరుద్ధరణపై కాంగ్రెస్ సర్కారు చేసిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఫ్యాక్టరీలోని మెషినరీ స్థితిగతులను పరిశీలించకుండానే తెరిపిస్తామనడం కార్మికులు, రైతులను అయోమయానికి గురి చేస్తున్నది. సెప్టెంబర్ 17లోపు నిజాం షుగర్స్ను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల నిజామాబాద్ బహిరంగ సభలో ప్రకటించారు. తాజాగా కొన్ని నిధులు కూడా విడుదల చేశారు. అయితే, లేఆఫ్ కారణంగా ఎనిమిదేండ్ల క్రితం మూతబడిన ఫ్యాక్టరీ పూర్తిగా పిచ్చిమొక్కలు, ముళ్ల చెట్లతో నిండిపోయింది. మెషినరీ, బాయిలర్లు, విలువైన పరికరాలు తుప్పుపట్టాయి. ఫ్యాక్టరీలోని మిల్హౌస్, ఇతర యంత్రాల వద్దకు వెళ్లేందుకు వీలులేని పరిస్థితి నెలకొన్నది. మిషినరీ స్థితిగతుల పరిశీలన, ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిపుణుల కమిటీని వేయలేదు. చెరుకు సాగువైపు రైతులను ప్రోత్సహించే కార్యాచరణ లేదు. సమగ్ర ప్రణాళిక లేకుండానే, యంత్రాలు పని చేస్తాయో లేదో పరిశీలించకుండానే సీఎం ప్రకటన చేయడం విస్మయానికి గురి చేస్తున్నది. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసమే మళ్లీ పునరుద్ధరణ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందని రైతులు, కార్మికులు మండిపడుతున్నారు.
బోధన్లోని చక్కెర కర్మాగారం దేశంలోనే ప్రభుత్వరంగంలో ఏర్పడిన తొలి చక్కెర ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ లాభాలతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏడు చక్కెర కార్మాగారాల నిర్మాణం జరిగింది. శక్కర్నగర్, కామారెడ్డి, ఆంధ్రప్రదేశ్లోని చాగల్లులో ఆల్కాహాల్ డిస్టిల్లరీలను నిజాం షుగర్స్ నడిపేది. నాగార్జున్సాగర్లో మెషినరీ డివిజన్ ఉండేది. ఆసియాలోనే అతిపెద్ద కర్మాగారంగా పేరొందిన నిజాం షుగర్స్ను ఆంధ్ర పాలకులు భ్రష్టు పట్టించారు. ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా చక్కెర ఫ్యాక్టరీలన్నీ అమ్ముడుపోగా, 2000 నాటికి బోధన్ శక్కర్నగర్, జగిత్యాల జిల్లా ముత్యంపేట్, మెదక్ జిల్లా ముంబోజిపల్లి చక్కెర ఫ్యాక్టరీలు మాత్రమే మిగిలాయి. 2002 వరకు కూడా లాభాలను ఆర్జిస్తున్న ఆయా కర్మాగారాలతో పాటు శక్కర్నగర్లోనే ఉన్న ఆల్కహాల్ డిస్టిల్లరీని అప్పటి సీఎం చంద్రబాబు.. డెల్టా పేపర్ మిల్స్కు జాయింట్ వెంచర్ పేరిట అప్పగించాడు. ప్రైవేట్ యాజమాన్యం ఫ్యాక్టరీ సొమ్మును అమ్ముకుని అందిన కాడికి దోచుకున్నది. చివరకు ఫ్యాక్టరీని నడుపలేమంటూ ఎనిమిదేళ్ల క్రితం లేఆఫ్ ప్రకటించి మూసివేసింది. దీంతో బోధన్లో సుమారు 15 వేల ఎకరాల వ్యవసాయ భూముల్లో చెరుకు సాగు నిలిచిపోయింది. నిజాం షుగర్స్కు అనుబంధంగా ఉన్న దాణా ఫ్యాక్టరీ, సోడాగ్యాస్ యూనిట్, చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి.
వాస్తవానికి ఫ్యాక్టరీ రన్నింగ్ కండిషన్లో ఉన్నప్పుడే అనేక నిర్వహణ క్రతువులు ఉంటాయి. అలాంటిది ఎనిమిదేండ్లుగా ఎలాంటి నిర్వహణ లేకుండా పడి ఉన్న యంత్రాలు పని చేస్తాయా? అన్నది అనుమానాస్పదంగా మారింది. వాస్తవానికి క్రషింగ్ సీజన్ పూర్తయిన తర్వాత.. వచ్చే సీజన్ కోసం ఏటా ‘ఓవర్ ఆయిలింగ్’ చేస్తుంటారు. ఈ ప్రక్రియ ఆర్నెళ్ల పాటు కొనసాగుతుంది. ఓవర్ ఆయిలింగ్కు ఒక్కోసారి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుంటుంది. రన్నింగ్ కండిషన్లో ఉన్న ఫ్యాక్టరీ ఓవర్ ఆయిలింగ్ కోసమే ఇంత తతంగం ఉంటే, ఎనిమిదేండ్లు నిరుపయోగంగా ఉన్న ఫ్యాక్టరీని నడపాలంటే ఎంతో అకుంఠిత దీక్ష, సమగ్ర కార్యాచరణ, నిధుల కేటాయింపు అవసరం. ఇక, ఆయిలింగ్ కోసమే ఆర్నెళ్లు పడితే.. రన్నింగ్లో లేని మిషన్ల మరమ్మతులకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇందుకోసం అప్పట్లో ఏటా రూ.2 -3 కోట్లు ఖర్చు అయినప్పుడు.. పాడయిన యంత్రాలతో కూడిన ఫ్యాక్టరీని గాడిలో పెట్టాలంటే ఎన్ని కోట్లు కావాలో లెక్కేయాలి. కానీ, రేవంత్ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక, ఫ్యాక్టరీలో మెషినరీ పరిశీలన చేపట్టకుండానే పునరుద్ధరణ ప్రకటన చేసింది. యంత్రాలు ఏ స్థితిలో ఉన్నాయి.. కొత్తగా ఏయే యంత్రాలను తెప్పించాలో తెలుసుకోకుండానే పునరుద్ధరణ అంటూ కాంగ్రెస్ పాలకులు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇదంతా అన్న అనుమానం కలుగుతున్నది. నిపుణుల కమిటీ నియామకం లేకుండా, ఫ్యాక్టరీ మరమ్మతు పనుల కోసం రూపాయి కేటాయించకుండా ‘పునరుద్ధరణ’ ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.
ఎనిమిదేండ్ల నుంచి వినియోగంలో లేకపోవడంతో ఫ్యాక్టరీలోని యంత్రాలు పాడైపోయాయి. బాయిలర్స్ ట్యూట్లు, జ్యూస్ హీటర్స్, జ్యూస్ ప్యాన్లు, క్రిస్టల్ లైనర్స్, సల్ఫేట్ హౌస్, సున్నం మిల్లు తదితర యంత్రాలు దెబ్బతిన్నాయని కార్మికులు చెబుతున్నారు. మిల్హౌస్ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. వాటర్ కూలింగ్ ప్లాంట్ దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నది. ఫ్యాక్టరీ పైకప్పు మొత్తం శిథిలావస్థకు చేరింది. వందలాది ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. చిన్నసైజు మోటార్లు, పరికరాలు, స్క్రాప్ ఈ ఎనిమిదేండ్లలో టన్నుల కొద్దీ చోరీకి గురయ్యాయి. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యం గతంలో చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిచ్చిమొక్కలతో నిండిపోయిన కర్మాగారాన్ని తెరిపించాలంటే సమగ్ర కార్యాచరణ అవసరం. కానీ అదేదీ లేకుండానే రేవంత్ ప్రకటన చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామనడం సంతోషకరం. అయితే, నిజాం షుగర్స్ను ఏవిధంగా తెరిపిస్తారన్న విష యం అర్థంకావడం లేదు. ఫ్యాక్టరీలోని యంత్రాలు ఎనిమిదేండ్లుగా పని చేయకపోవడంతో పాడయిపోయి ఉంటాయి. ఆ యంత్రాల పరిస్థితిని ఇప్పటికీ పరిశీలించలేదు. ఇంజినీర్లు, అధికారులను నియమించి మెషినరీపై స్టడీ చేయాలి. సెప్టెంబర్ 17న ప్రారంభిస్తామని రేవంత్రెడ్డి చెబుతున్నారు. ఇప్పటివరకు నిపుణుల బృందం యంత్రాలను పరిశీలించలేదు. చెరుకు సాగు కోసం చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోసమే పునరుద్ధరణ అంటున్నారా అన్న అనుమానం కలుగుతున్నది. ఫ్యాక్టరీని నడిపించాలన్న చిత్తశుద్ధి ఉంటే వెంటనే యంత్రాల మరమ్మతులు చేపట్టాలి.