గౌహతి: భారీ భద్రత మధ్య 330 ఎకరాల్లోని ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. అస్సాంలోని సోంటిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న బార్చల్లా చితల్మారి ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో వేలాది మంది అక్రమంగా నివసిస్తున్నారు. ఆ నది దక్షిణ ఒడ్డు కోతకు గురికావడంతో నాగోన్, మోరిగావ్ జిల్లాలకు చెందిన వేలాది మంది ఈ ప్రాంతానికి వలస వచ్చారు. సుమారు 300 కుటుంబాలకు చెందిన వారు ఇళ్లు కట్టుకుని పదేళ్లకుపైగా ఇక్కడ ఉంటున్నారు.
కాగా, 330 ఎకరాల్లో విస్తరించిన ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్రమంగా నిర్మించిన ఇళ్లను, స్థలాలను ఆక్రమణదారులు ఖాళీ చేయాలంటూ అధికారులు ఎనిమిది నెలల కిందటే నోటీసులు ఇచ్చారు. దీంతో 90 శాతం మంది ఇప్పటికే ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మెగా ఆక్రమణల తొలగింపును అధికారులు చేపట్టారు. 50 జేసీబీ యంత్రాలు, వందల సంఖ్యలో కూలీలు, పదుల సంఖ్యలో అధికారులు, సుమారు 1,200 మంది సెక్యూరిటీ సిబ్బంది ఈ డ్రైవ్లో పాల్గొన్నారు. అక్రమ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
మరోవైపు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరుగకుండా పారా మిలిటరీ బలగాలు, అల్లర్లను అదుపు చేసే యంత్రాలతో ఆ ప్రాంతంలో మోహరించారు. అయితే పదేళ్లకుపైగా తాము ఇక్కడ నివాసిస్తున్నామని, ప్రభుత్వం తమకు పునరావాసం కల్పించలేదని కొందరు మహిళలు వాపోయారు. తాము ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.