న్యూఢిల్లీ : అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ గురువారం ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం జూన్ 28 నుంచి ప్రారంభమై.. ఆగస్ట్ 22 వరకు కొనసాగనుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది యాత్రను అమర్నాథ్ దేవస్థానం బోర్డు రద్దు చేసింది. ఈ సారి సైతం కొవిడ్ నిబంధనల మధ్యే కొనసాగుతుందని స్పష్టం చేసింది. 13 ఏళ్లలోపు పిల్లలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించబోమని బోర్డు తెలిపింది. దాదాపు రెండేళ్ల తర్వాత యాత్ర ప్రారంభం అవుతుండడంతో సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో దక్షిణ కాశ్మీర్లో ఉన్న మంచులింగాన్ని దర్శించుకునేందుకు ఆరు లక్షల వరకు భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా 446 పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూకాశ్మీర్ బ్యాంక్, యస్ బ్యాంక్ శాఖల్లో యాత్ర రిజిస్ట్రేషన్కు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ బ్యాంకు శాఖల వివరాలు www.shriamarnathjishrine.com అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. మార్చి 15 తర్వాత మంజూరు చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుతాయని అధికారులు స్పష్టం చేశారు. హెలికాప్టర్లో ప్రయాణించాలనుకునేవారికి ఎలాంటి ముందస్తు నమోదు అవసరం లేదని పేర్కొన్నారు. 56 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్ర ఈ సారి బాల్తాల్, చందన్వారీ మార్గాల్లో ప్రారంభమవుతుందని బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితీశ్వర్ కుమార్ తెలిపారు.
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణలో ఆరు బ్యాంకులు, ఏపీలో ఆరు బ్యాంకు శాఖలకు అవకాశం కల్పించారు. కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట, సికింద్రాబాద్లోని లోని పీఎన్బీ బ్యాంకులు, హైదరాబాద్లోని పీఎన్బీ హిమాయత్సాగర్ బ్రాంచ్తో పాటు జమ్మూకాశ్మీర్ బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఏపీలోని కృష్ణా, గుంటూరు చిత్తూరు, కడప, నెల్లూరు, విశాఖపట్నంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు.