కోల్కతా/గువాహటి : పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్ గురువారం ప్రారంభమైంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఎనిమిది విడతల్లో, 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 27న తొలి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బెంగాల్లో రెండో విడతలో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. 171 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 75,94,549 మంది ఓటర్లు వారి భవితవ్యం నిర్ణయించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో 10,620 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఓటింగ్ జరిగే అన్ని ప్రాంతాలను సున్నితమైనవిగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
రెండో విడతలో నందిగ్రామ్ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ అధికార టీఎంసీ నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలోకి దిగారు. ఇప్పటికే అధికార, విపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేపట్టాయి. ఈ క్రమంలో నందిగ్రామ్ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఈసీ 144 సెక్షన్ విధించింది. హెలికాప్టర్ ద్వారా గగనతలం నుంచి నిఘా ఏర్పాట్లు చేశారు. అలాగే సున్నిత ప్రాంతాలు కావడంతో ఈసీ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 650 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది.
బెంగాల్లో రెండో విడత ఎన్నికల్లో పలువురు సినీతారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీఎంసీ నుంచి ఛండీపూర్ నుంచి సొహం చక్రవర్తి, బంకూరా నుంచి సయాంటికా బెనర్జీ, ఖరగ్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా హిరణ్మయి ఛటోపాధ్యాయ పోటీ చేస్తున్నారు.
రెండో విడతలో అసోంలో 39 స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో 394 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనుండగా.. 73,44,631 మంది ఓటు వేయనున్నారు. 13 జిల్లాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది. 34 స్థానాల్లో బీజేపీ, 24 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు. 310 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.