Lunar Eclipse | వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, మార్చి3: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయాలతో పాటు చిన్న ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. చంద్రగ్రహణం అనంతరం సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ చేసి, తిరిగి ఆలయాలను తెరవనున్నారు.
చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడలోని రాజన్న భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను ప్రాతకాల పూజ అనంతరం అర్చకులతో కలిసి ఆలయ అధికారులు ఆలయాలను మూసివేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల్లోపు చంద్రగ్రహణం ఉండగా సాయంత్రం సంప్రోక్షణ అనంతరం స్వామివార్లకుప్రదోషకాల పూజ నిర్వహించనున్నారు. తర్వాత ఏడున్నర గంటల నుంచి దర్శనాలను యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేయడంతో భీమేశ్వరాలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మానుష్యంగా మారాయి.

Yadagirigutta
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, అనుబంధ ఆలయాలను ప్రధానార్చకులు, ఆలయ అధికారులు మూసివేశారు. మంగళవారం ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారి సుప్రభాత సేవ, తిరువాధన, భాలభోగం, ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకం చేపట్టి స్వామి, అమ్మవార్ల ఉభయ దర్శనాలకు అనుమతినిచ్చారు. ఉదయం 7 గంటలకు స్వామి వారి ప్రధానాలయానికి ద్వారా బంధనం గావించి, మూసి వేశారు. రేపు ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, శుద్ధి పూజలు నిర్వహించి స్వామి వారి నిత్య కైంకర్యాలు, ఉభయ దర్శనాలను కొనసాగిస్తామని ఆలయ ప్రధానఅర్చకులు భట్టర్ సురేంద్రాచార్యులు తెలిపారు.

Bhadrachalam
చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం ఉదయం 8.:30 గంటలకు ఆలయం తలుపులు మూసివేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నారు.
నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో ఉదయం 7 గంటలకు సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మీ అమ్మవార్లకు అభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం ప్రధాన ఆలయంతో పాటు, ఉప ఆలయాలను మూసివేశారు. సాయంత్రం 7 గంటల తర్వాత సంప్రోక్షణ నిర్వహించి, రేపు ఉదయం నుంచి భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవల దర్శనం కల్పించనున్నట్లు ఈవో విజయరామారావు తెలిపారు.

చంద్రగ్రహణం నేపథ్యంలో కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానాన్ని ద్వారా బంధం చేపడుతున్న ఆలయ అర్చకులు, ఉద్యోగులు

చంద్రగ్రహణం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం మరియు అనుబంధ ఆలయాల మూసివేత