హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నదని, చాలా మంచి పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశంసించారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఐటీ రంగంలో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందని కొనియాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి మరిన్ని నిధులు ఇచ్చి, ప్రోత్సహించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం నిజంగా బాగున్నదని, మంచి ఆలోచన అని కితాబిచ్చారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇది నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఎందుకు ఇవ్వడం లేదో కేంద్రాన్ని ప్రశ్నిద్దామని, అవసరమైతే అసెంబ్లీ తీర్మానం చేసి పంపిద్దామని సూచించారు.