కడ్తాల్, జూన్ 7, (ఆమనగల్లు) : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లెప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు.
గ్రామంలోని ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత, మొక్కల పెంపకం, మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం పరుచుకోవాలని సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నదని, పల్లెప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్ధిన అధికారులను ఆయన అభినందించారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి, క్రీడాకారులతో కలిసి ఆయన కాసేపు వాలీబాల్ ఆడారు. క్రీడాకారులను ప్రొత్సాహించడానికి గ్రామాల్లో చేపట్టిన క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీపీ అనిత, జడ్పీటీసీ అనురాధ, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ పీడీ శ్రీలత, సర్పంచ్లు రజిత, సోనీ, మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.