ములుగు, జనవరి 29 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతరను సమిష్టి కృషితో విజయవంతం చేయాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా పనులు చేపట్టాలని కోరా రు. జంగపన్నవాగు వద్ద నీరు నిల్వ ఉండకుండా నిరంతరం ప్రవహించేలా చూడాలని చెప్పారు. భక్తులకు పంపిణీ చేసేందుకు 50 లక్షల మాస్లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వీఐపీ దర్శనాల కోసం మంజూరుచేసే వాహనదర్శన పాసులను తేదీల వారీగా కేటాయించాలని సూచించారు.
జాతరకు ప్రత్యేక కార్యచరణ: ఎర్రబెల్లి
సమ్మక-సారలమ్మ జాతర విజయవంతానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారుల కు సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించిన మేడారం జాతరలకు సీఎం కేసీఆర్ రూ.332 కోట్ల నిధులను కేటాయించారని గుర్తుచేశారు. మొకులు చెల్లించేందుకు భక్తులు ముందస్తుగా వస్తున్నందున ఫిబ్రవరి మొదటి వారం నుంచి సౌకర్యాలను మెరుగు పర్చాలని ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. జాతరలో భక్తుల వసతుల కల్పనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు. సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిస్టినా జడ్చోంగ్తూ, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్మన్లు కుసుమ జగదీశ్, గండ్ర జ్యోతి, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తకళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక తదితరులు పాల్గొన్నారు.
మేడారం జాతరలో ఈ-హుండీ ఏర్పాటు
తాడ్వాయి, జనవరి 29: మేడారం జాతరలో తొలిసారి ఈ-హుండీ ఏర్పాటైంది. భక్తుల సౌకర్యార్థం శనివారం జాతర కార్యనిర్వాహక అధికారి రాజేంద్రం క్యూఆర్ కోడ్ స్కానర్ను ఆవిష్కరించగా, వీటిని గద్దెల పరిసరాలతోపాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. కొవిడ్ కారణంగా మేడారం వచ్చేందుకు భయపడే భక్తులకు కూడా ఈ-హుండీ ఉపయోగపడునున్నది. ఈ-స్కానర్ను పత్రికల్లో ప్రకటనల రూపంలో ప్రచురిస్తామని, భక్తులు ఎక్కడినుంచైనా కానుకలను సమర్పించుకోవచ్చని ఈవో తెలిపారు.