హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తడిబట్టతో రైతుల గొంతు కొసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మోసకారితనం బట్టబయలైనందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగుచేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతులు మోసపోవద్దనేదే రాష్ట్ర ప్రభుత్వ తపన అని చెప్పారు.
ఆదివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం రైతుల పట్ల బా ధ్యత లేకుండా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యతను విస్మరించిన పీయూష్గోయల్ పార్లమెంటును తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు. రాష్ర్టాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత తమదేనన్న ఇంగితజ్ఞానం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు, మి ల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్సీఐ బాధ్యతేనని స్పష్టం చేశారు.
రాష్ట్రం నుంచి బియ్యం తరలించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్, జిల్లాల కలెక్టర్లు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల బియ్యాన్ని వాళ్లు తీసుకెళ్లకుండా రాష్ట్రం పంపలేదని అనడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా కేంద్రం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేసిందంతా బాయిల్డ్ రైసేనన్న విషయం తెలవకపోవడం బీజేపీ నేతల అవివేకానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. గత ఏడేండ్లలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో పండిన మొత్తం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసిందని ఆయన గణాంకాలతో వివరించారు. గతంలో మాదిరిగానే కొనుగోలు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ అని స్పష్టంచేశారు.
నిజానికి దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ర్టాలకు సంబంధం ఉండదని, ఏర్పాట్లను మాత్రమే పర్యవేక్షిస్తాయని వివరించారు. ఈ విషయాన్ని కేంద్రం మరచి రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించటంలో కాం గ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని దుయ్యబట్టారు. రాష్ట్ర రైతాంగం కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన చేస్తున్నా రెండు జాతీయ పార్టీలు తమ బాధ్యతను విస్మరించాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలకు అధ్యక్షులుగా ఎంపీలే ఉన్నా ప్రయోజనం సున్నా అని ఎద్దేవా చేశారు.
యాసంగిలో కొనుగోలు కేంద్రాలుండవు
కేంద్ర సర్కారు ఎన్ని కుట్రలు చేసినా వానకాలంలో తడిసిన, రంగుమారిన ధాన్యంతో సహా పంట మొత్తం కొనుగోలుచేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నిరంజన్రెడ్డి భరోసా ఇచ్చారు. వచ్చే యాసంగిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోదని పునరుద్ఘాటించారు. రైతులు వరి పం డించి, ఇబ్బందులకు గురికావద్దని, ఇతర పంటలు సాగుచేయాలని ఆయన సూచించారు. ఇతర పంటలు పండించే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు అన్నీ సమృద్ధిగా ఉన్నాయని మంత్రి చెప్పారు. దీనిపై జిల్లాలవారీగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారని, రైతులు ఆ మేరకు ఇతర పం టలు వేసుకోవటానికి సిద్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో రెండు లక్షల ఎకరాలున్న కందిపంట ఇప్పుడు 10 లక్షల ఎకరాలకు చేరిందని గుర్తుచేశారు. వచ్చే వానకాలంలో పత్తి పంట కోటి ఎకరాల్లో సాగుచేసే అవకాశం ఉన్నదని మంత్రి పేర్కొన్నారు.
పొలానికి రైతు కాపలా..
రైతులకు సీఎం కేసీఆర్ కాపలా
రైతులు తమ పొలానికి కాపలా ఉన్నట్టే.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు కాపలాగా ఉంటున్నారని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రైతుల ముఖాల్లో శాశ్వత సంతోషం చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. రైల్వేలు, బీఎస్ఎన్ఎల్, ఓడరేవులు మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతున్నట్టే.. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎఫ్సీఐని కూడా అమ్మే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ముందే పసిగట్టిన సీఎం కేసీఆర్ రెండేండ్ల నుంచే పంటల మార్పిడిపై రాష్ట్ర రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని వివరించారు. దీంతో రైతుల్లో కూడా చాలా మార్పు వచ్చిందని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
రైతుల్లో అయోమయం సృష్టిస్తున్న బీజేపీ
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభు త్వం ఒక రకంగా, రాష్ట్ర బీజేపీ నేతలు మరోరకంగా మాట్లాడుతూ, రైతుల్లో అయోమయం సృష్టిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ సభ్యులు పార్లమెం టు ఉభయసభల్లో ఆందోళన చేస్తున్నా, కేంద్రం అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సీఐ సహకరించడం లేదని చెప్పారు. నల్లగొండ జిల్లాలో గతంలో ఎఫ్సీఐ ప్రైవేట్ గోదాములను కూడా తీసుకొని, మిల్లర్లకు వడ్లను పంపించి, వారి నుంచి బియ్యాన్ని సేకరించేదని చెప్పారు.